Publish Date: Sun, 31 May 2020 (12:41 IST)
Updated Date: Sun, 31 May 2020 (12:42 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయనీ, అలాగే, క్రికెట్ రంగంలోనూ మార్పులు సంతరించుకుంటాయని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల మాదిరిగానే, ఇకపై క్రికెట్ కూడా మారిపోబోనుందని వ్యాఖ్యానించారు.
కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చేంత వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని, ఆ తర్వాత మాత్రం సాధారణ స్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పటివరకు క్రికెట్ పోటీల నిర్వహణపై ఆచితూచి అడుగులు వేయాల్సివుంటుందన్నారు.
ఈ మహమ్మారి కారణంగా క్రికెట్ షెడ్యూల్స్లో మార్పులుంటాయన్నారు. అదేసమయంలో ఐసీసీతో కలిసి క్రికెట్ను సాధారణ స్థితికి తీసుకస్తామన్నారు. క్రికెట్ చాలా శక్తిమంతమైన ఆటని, ఆటగాళ్లకు కూడా కొన్ని పరీక్షలు తప్పవని వ్యాఖ్యానించారు.
భారతీయుల్లో ప్రతిఘటించే శక్తి అధికమని, ప్రస్తుతానికి ఔషధాలు లేకున్నా, అతి త్వరలోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు.
తన చిన్న వయసులో ఫుట్బాల్ గేమే జీవితంగా గడిపానని, అనుకోకుండా క్రికెటర్గా మారానని చెప్పిన గంగూలీ, చిన్న వయసులో ఒడిశాపై చేసిన శతకం, లార్డ్స్ మైదానంలో చేసిన సెంచరీ, తనకు మధుర స్మృతులని చెప్పుకొచ్చారు.