భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మాజీ ఫ్రాంచేజీ కొచ్చి టస్కర్స్ కేరళకు అనుకూలంగా వెలువడిన మధ్యవర్తిత్వ తీర్పును న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీకి రూ.538 కోట్లు చెల్లించాలని బీసీసీఐ ఆదేశిస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఈ వివాదం చాలా ఏళ్లుగా నడుస్తుండగా తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొచ్చి ఫ్రాంచైజీకి పెద్ద ఊరట లభించినట్టయింది.
కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ ఐపీఎల్లో కేవలం ఒకే ఒక సీజన్ (2011) ఆడింది. ఒప్పందం ప్రకారం బ్యాంక్ గ్యారెంటీని సకాలంలో సమర్పించలేదన్న కారణంతో ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ 2011లో బీసీసీఐ ఈ ఫ్రాంచైజీని అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిపై కొచ్చి టస్కర్స్ యాజమాన్యం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది.
2015లో ఆర్బిట్రేటర్ జస్టిస్ లహోటి నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ కొచ్చి టస్కర్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసీపీఎల్ (కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్)కు రూ.384 కోట్లు, రెండెన్ జ్వాస్ స్పోర్ట్స్కు రెండెన్జౌస్ రూ.153 కోట్లు, మొత్తంగా సుమారు రూ.550 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ బాంబే హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు, మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం తమ పరిధి చాలా పరిమితమని స్పష్టం చేసింది. 'మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 కింద ఈ కోర్టు పరిధి చాలా తక్కువ. వివాదం యొక్క మెరిట్స్లోకి వెళ్లడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నం, చట్టంలోని సెక్షన్ 34లో ఉన్న నిబంధనల పరిధికి విరుద్ధం' అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పును సమర్థిస్తూ కొచ్చి టస్కర్స్కు రూ.538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది.