Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోణీ కొట్టలేక పోయిన న్యూజిలాండ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా

బోణీ కొట్టలేక పోయిన న్యూజిలాండ్.. చరిత్ర సృష్టించిన టీమిండియా
, ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (16:39 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆతిథ్య కివీస్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌ను క్లీన్‌స్విప్ చేసింది. విదేశీ గడ్డపై ఓ సిరీస్‌ను వైట్ వాష్ చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో సైతం కోహ్లీ సేన విజయభేరీ మోగించింది. ఫలితంగా ట్వంటీ20 సిరీస్‌ను 5-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
అంతకుముందు, టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ(60 - రిటైర్డ్ హర్ట్), రాహుల్(45), శ్రేయాస్(33 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దూబే, సంజు శాంసన్‌లు మరోమారు నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో కుగ్గెలిన్ రెండు వికెట్లు, బెన్నెట్ ఒక వికెట్ తీసుకున్నారు.
 
కాగా, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. బ్యాటింగ్‌లో రాణించిన రోహిత్ శర్మ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అలరించాడు. అయితే కండరాల గాయం బాధించడంతో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మిడిలార్డరులో శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ చివర్లో మనీష్ పాండే 4 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ తో 11 పరుగులు రాబట్టడంతో ప్రత్యర్థి ముంగిట గౌరవప్రదమైన స్కోరును ఉంచింది. 
 
ఆ తర్వాత 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ విజయానికి చివరి ఓవరులో 21 పరుగులు అవసరం కాగా, ఇష్ సోధీ సిక్సర్లతో విరుచుకుపడినా శార్దూల్ ఠాకూర్ నిబ్బరంతో బౌలింగ్ వేయడంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరింది. కివీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ 50, రాస్ టేలర్ 53 పరుగులు చేశారు.
 
అయితే, చివరి ఓవర్లో ఇష్ సోధీ ఊపు చూస్తే ఆతిథ్య జట్టు గెలుస్తుందనే అనిపించింది. రెండు భారీ సిక్సర్లతో టీమిండియా శిబిరంలో గుబులు రేపాడు. అయితే, చివరి రెండు బంతుల్లో భారీ షాట్లు కొట్టలేకపోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. 
 
ఓ దశలో కివీస్ సజావుగానే లక్ష్యఛేదన చేస్తుందనిపించినా, బుమ్రా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు 3, సైనీకి 2, ఠాకూర్‌కు 2 వికెట్లు దక్కాయి. సుందర్ ఓ వికెట్ తీశాడు. మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను నెగ్గడం ద్వారా భారత్ ఈ సిరీస్‌లో 5-0తో కివీస్‌ను వైట్ వాష్ చేసినట్టయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైనల్ టీ20 : రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ .. కివీస్ టార్గెట్ 164