దుబాయ్లో మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్తో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. విరాట్ కోహ్లీ 84 పరుగులతో మెరిశాడు. ఫలితంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్ (45), కెఎల్ రాహుల్ (42 నాటౌట్), హార్దిక్ పాండ్యా (28) కూడా కీలక పాత్రలు పోషించారు. హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో 3 భారీ సిక్స్లు బాది టీమిండియాపై ఒత్తిడి తగ్గించాడు. విజయం ముంగిట హార్దిక్ పాండ్యా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. జడేజా సాయంతో కేఎల్ రాహుల్ భారీ సిక్సర్తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు, ఆస్ట్రేలియాను 264 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 48 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫలితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టింది. ఈ గెలుపుతో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వరుసగా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. దీంతో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డ్ను బద్దలు కొట్టాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్ శర్మకు ఇది 65వ సిక్స్. దాంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న 64 సిక్స్ల రికార్డ్ను రోహిత్ అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(65), క్రిస్ గేల్(64) తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్(49), డేవిడ్ మిల్లర్(45), డేవిడ్ వార్నర్(42), సౌరవ్ గంగూలీ(42) ఉన్నారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 250 సిక్స్లు బాదిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్(10,889)ను రోహిత్ శర్మ అధిగమించాడు.