Publish Date: Wed, 11 Feb 2026 (17:00 IST)
Updated Date: Wed, 11 Feb 2026 (17:02 IST)
భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అందరికీ ఆసక్తి. ట్వంటీ-20 ప్రపంచ కప్లో భాగంగా ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని రెండు రోజుల క్రితం పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.
నువ్వా నేనా అంటూ ఆసక్తికరంగా జరిగే ఈ మ్యాచ్ కోసం వారు ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు దీంతో కొలంబోకు విమాన టిక్కెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముంబై-కొలంబో-ముంబై విమాన టిక్కెట్ ధర నిన్న ఉదయం రూ.60,000గా ఉండగా, ఈరోజు మరింత పెరిగింది.
ముంబై నుంచి కొలంబోకు ఎకానమీ టిక్కెట్ ధర రూ.60,000 ఉండగా, ప్రీమియం ఎకానమీ ధర రూ.84,000గా ఉంది. శ్రీలంక ఎయిర్ లైన్స్లో ముంబై-కొలంబో విమానం టిక్కెట్ ధర రూ.63,340, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,34,157గా ఉంది. సాధారణంగా ఢిల్లీ-కొలంబో టిక్కెట్ ధర రూ.30,000 ఉండగా, ఇప్పుడు రూ.90,000కు చేరుకుంది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు రూ.1,92,000 నుంచి రూ.2,25,000 వరకు పలుకుతున్నాయి.
మొదట భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పలు దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించి ఉత్కంఠకు తెరదించింది.