ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో మూడు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన నేపథ్యంలో.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తనపై తనకు నమ్మకం పెరిగిందంటున్నాడు. తొలి 20-25 బంతుల వరకు బంతికో పరుగు చొప్పున చేయడంలో తనకు ఇబ్బందేమీ లేదని కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే తర్వాతి 15 బంతుల్లో 40-45 పరుగులు చేయగలననే నమ్మకం తనకుందని.. సిక్సర్లు బాదే విషయంలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగిందని కోహ్లీ వెల్లడించాడు. గతంతో పోలిస్తే తన ఆటతీరు మెరుగైందనే నమ్మకం తనలో ఉందన్నాడు.
గతంలో తనకు సిక్సర్లు కొట్టగలిగే సామర్థ్యం లేదని.. అందుకే ఫోర్లపై దృష్టి పెడుతున్నానని గతంలో వ్యాఖ్యానించిన కోహ్లీ.. ప్రస్తుతం తన ఆటతీరు మెరుగైందని వ్యాఖ్యానించడంపై ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కోహ్లీలో పెరిగిన ఆత్మవిశ్వాసంతో మరిన్ని మ్యాచ్ల్లో అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.