Publish Date: Fri, 13 Mar 2026 (11:32 IST)
Updated Date: Fri, 13 Mar 2026 (11:55 IST)
SRH యాజమాన్యం చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ భారీగా పడుతున్నాయి. ఇంగ్లాండ్లో గురువారం నాడు ది హండ్రెడ్ లీగ్ వేలంలో సన్ రైజర్స్ సీఈఓ కావ్యా మారన్ ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీతో ఓ ఆటగాడిని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. ఆ ఆటగాడు పాకిస్తాన్ దేశానికి చెందినవాడు కావడంతో అంతా షాక్ తిన్నారు. అత్యంత వివాదాస్పద ఆటగాడిగా పేరున్న అబ్రార్ అహ్మద్ను ఏకంగా రూ. 2.34 కోట్లకు కావ్యా మారన్ పోటీపడి గెలుచుకున్నారు. ఇది తెలిసిన దగ్గర్నుంచి ఆమెపై తీవ్రంగా ట్రోల్స్ పడుతున్నాయి.
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశంపై అవాకులు చెవాకులు పేలిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం మీకెలా సాధ్యమైంది కవ్యా మారన్ గారూ అంటూ మండిపడుతున్నారు. ఒక భారతీయ యాజమాన్యానికి చెందిన క్రికెట్ ఫ్రాంచైజీ పోయిపోయి పాకిస్తాన్ ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారూ?
మొన్నటికిమొన్న టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఆ దేశం చేసిన నిర్వాకం మీకు గుర్తులేదా? కనీసం మైదానంలో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో వున్న ఆ జట్టులోని ఆటగాళ్లను మీరు ఎలా దక్కించుకోవాలని అనుకున్నారూ అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో SRH ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి వుంది.