భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన లోక్సభ సభ్యురాలిని పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ పెద్దలు కూడా అంగీకరించినట్టు సమాచారం. కాగా, ఈ నెల 8వ తేదీన వీరి వివాహ నిశ్చితార్థం జరుగనున్నట్టు రింకూ సింగ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరుగనుంది. అలాగే, వీరిద్దరి వివాహం ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో నిర్వహించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయిచారు.
కాగా, వధువు పేరు ప్రియా సరోజ్. వయసు 26 యేళ్లు. రాజకీయవేత్త, న్యాయవాది కూడా. సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు. 25 యేళ్ళకే లోక్సభలో అడుగుపెట్టారు. తద్వారా అతి చిన్నవయసులోనే పార్లమెంట్కు ఎంపికైన వారిలో ఒకరిగా నిలిచారు. గతయేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆమె మచ్లిషహర్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత సరోజ్ను ఓడించి తమ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు.
మరోవైపు, రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టు టీ 20 ఫార్మెట్లో యువ క్రికెటర్. అలీగఢ్లోని సాధారణ కుటుంబంలో జన్మించిన రింకూ సింగ్... క్రికెట్ శిక్షణ, అవకాశాల కోసం అలుపెరగని పోరాటం చేశాడు. ఐపీఎల్ సక్సెస్లో అయిన తర్వాత రింకూ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.