ఆసియా క్రికెట్ కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. దీంతో భారత్ ముంగిట 128 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (31), సుభమన్ గిల్ (10), సూర్య కుమార్ యాదవ్ (47), తిలక్ వర్మ (31), శివమ్ దూబే (10)లు రెండంకెల స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో సైమ్ ఆయూబ్ 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో ఆసియా కప్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు దుబాయ్ వేదికగా భారత్ పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్కు భారత బౌలర్లు చుక్కు చూపించారు. ఆట మొదలైన తొలి 10 ఓవర్లలోనే కేవలం 49 పరుగులు చేసి నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లోపడింది. 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముంగిట 128 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
పాకిస్థాన్ జట్టులో సాహిబ్ జాదా ఫర్హాన్ చేసిన 40 పరుగులే టాప్ స్కోరర్గా నిలిచాయి. షాహీన్ ఆఫ్రిది (33), ఫకర్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటే, బుమ్రాలు రెండేసి వికెట్లు చొప్పున తీయగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్తో దాయాది జట్టును కట్టడి చేసింది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా, తొలి బంతికే సయిమ్ అయూబ్ను గోల్డెన్ డక్గా పెవిలియన్కు పంపాడు. రెండో ఓవర్లో బుమ్రా బౌలింగ్లో హారిస్ (3) రూపంలో రెండో వికెట్ లభించింది. ఆ తర్వాత సాహిబ్ జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ను ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. 7.4 ఓవర్లలో ఫకర్ జమాన్ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా, 13వ ఓవర్లో కుల్దీప్, చివర్లో షాహీన్ ఆఫ్రిది దూకుడుగా ఆడటంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.