Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో డబుల్​ మ్యుటెంట్​ కరోనా.. తెలంగాణ, ఏపీల్లోనూ మూలాలు: కేంద్ర ప్రభుత్వ ప్రకటన

దేశంలో డబుల్​ మ్యుటెంట్​ కరోనా.. తెలంగాణ, ఏపీల్లోనూ మూలాలు: కేంద్ర ప్రభుత్వ ప్రకటన
, బుధవారం, 24 మార్చి 2021 (17:03 IST)
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 771 రకాల కరోనా వైరస్‌లు. అది కూడా ఒక్క మన దేశంలోనే ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో ఇప్పుడు వెలుగు చూసింది. ‘డబుల్ మ్యుటెంట్’ రకం అని దానిని పిలుస్తున్నారు. ఈ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది.
 
బుధవారం ఈ కొత్త కరోనా వైరస్‌లు, డబుల్ మ్యుటెంట్ వైరస్ గురించి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 771 కొత్త రకాల కరోనా ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ కరోనా రకాల్లోని 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది.
 
ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం ఉన్నట్టు తేల్చింది. ఇంకో శాంపిల్‌లో బ్రెజిల్ రకం ఉందని పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటికి అదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది. కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణపై ఏర్పాటు చేసిన భారత సార్స్ కొవ్2 కన్సార్టియం.. కరోనా జన్యు క్రమాలను విశ్లేషించిందని వెల్లడించింది. వేరియంట్లు ఉండడం సర్వసాధారణమని, ప్రతి దేశంలోనూ వాటి ఆనవాళ్లుంటాయని కేంద్రం వెల్లడించింది.
 
ప్రస్తుతం జన్యు క్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించినవి, దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి తీసుకున్నవేనని పేర్కొంది. మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు తేలిందన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే ఇప్పుడు అవి ఎక్కువయ్యాయని తెలిపింది. ఇలాంటి మ్యుటెంట్ కరోనాలు రోగనిరోధక వ్యవస్థకు దొరక్కుండా తప్పించుకుంటాయని వెల్లడించింది. ఈ రెండు మ్యుటేషన్లు దాదాపు 20 శాతం శాంపిళ్లలో ఉన్నాయని చెప్పింది.
 
కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్‌ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది. ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
 
బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది. ప్రస్తుతం ఈ డబుల్ మ్యుటెంట్ కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయా? అన్న దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు