Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

విదేశీ పర్యాటకులపై నిషేధం... హోటల్ బుకింగ్స్ రద్దు - రాష్ట్రాలకు హెచ్చరిక

Advertiesment
Coronavirus Scare
, శుక్రవారం, 6 మార్చి 2020 (13:52 IST)
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య శుక్రవారానికి 31కి చేరింది. అలాగే, అనేక మంది అనుమానితులు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దు రాష్ట్రమైన సిక్కిం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోకి విదేశీ పర్యాటకులు రాకుండా నిషేధం విధించింది. 
 
ఇలా దేశంలో విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. అలాగే, రాష్ట్ర పరిధిలోని గ్యాంగ్‌‌టక్, డార్జిలింగ్, నాథులా తదితర ప్రాంతాల్లో ఉన్న హోటళ్ళలో విదేశీయులందరి బుకింగ్స్‌నూ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 
 
సాధారణంగా చైనా సరిహద్దు రాష్ట్రంగా సిక్కింలో స్వదేశీ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికన్లతో పాటు ఫ్రెంచ్, జర్మన్లు, జపనీయులు, చైనీయులు సిక్కిం, డార్జిలింగ్ తదితర ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 
 
అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తుండటంతో విదేశీ పర్యాటకుల రాకపోకలపై సిక్కిం నిషేధం విధించింది. అలాగే, విదేశీ పర్యాటకులను తీసుకుని రావద్దని వివిధ టూర్ ఆపరేటర్లకు సైతం ఆదేశాలు జారీ అయ్యాయి. పర్మిట్ల జారీని సైతం నిషేధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 
 
మరోవైపు, కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా  వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశాలు జారీచేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరింది. ఆగ్రా నగరానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కరోనా బాధితుడితో కలిసి ఉంది. దీంతో ఆ కుటుంబానికి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికతో లైంగిక సంబంధం.. భారతీయ విద్యార్థికి జైలు