Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా నుంచి కోలుకుంటున్న కర్నూలు - హడలెత్తిస్తున్న చిత్తూరు

కరోనా నుంచి కోలుకుంటున్న కర్నూలు - హడలెత్తిస్తున్న చిత్తూరు
, మంగళవారం, 12 మే 2020 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు అంతాఇంతాకాదు. ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపని ఈ వైరస్.. ఢిల్లీ మర్కజ్ మీట్ తర్వాత రాష్ట్రంలో తన ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేలకు పైగా కేసులు నమోదైవున్నాయి. ఇందులో కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఈ కేసులు ఉన్నాయి. అలా కొన్ని రోజులు పాటు కర్నూలు పట్టణ వాసులకు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేసింది. 
 
అయితే, కర్నూలు జిల్లా ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కేసులు రావడం మొదలైన తర్వాత, తొలిసారిగా, చికిత్స పొందుతున్న వారి సంఖ్య కన్నా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య అధికంగా నమోదైంది. తాజాగా శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 12 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 281కి చేరగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 278గా ఉంది. 
 
కాగా, జిల్లాలో కరోనా ప్రభావం కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో అధికంగా ఉంది. కొత్తగా సోమవారం ఒక్కరోజే 9 కేసులు రాగా, అన్నీ కర్నూలు నగరంలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ కర్నూలులో 366 మంది వ్యాధి బారిన పడగా, వారిలో సగానికి పైగా డిశ్చార్జ్ అయినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.
 
ఇక మొత్తం ఏపీలో నమోదైన కేసుల్లో 25 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతుండటం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగించగా, ఆపై తీసుకున్న కఠిన నిర్ణయాలు సత్ఫలితాలను అందించే దిశగా సాగాయి. కంటైన్ మెంట్ జోన్ల నిర్వహణ, లాక్ డౌన్ నిబంధనల అమలు తదితరాల్లో అన్ని ప్రభుత్వ వ్యవస్థలూ సమన్వయంతో పనిచేశాయి. దీంతో వైరస్ ఉద్ధృతి కొంతమేరకు నియంత్రణలోకి వచ్చింది.
 
మరోవైపు, చిత్తూరు జిల్లాను కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. ఈ జిల్లా వాసులు చెన్నైకు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా, చిత్తూరుకు చెందిన వ్యాపారులు చెన్నై కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వస్తుంటారు. దీంతో అనేక మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే చెన్నై మహానగరంలో చెన్నై కోయంబేడు కరోనా కేంద్రంగా నిలిచిన విషయం తెల్సిందే. మంగళవారం చిత్తూరులో నమోదైన 10 కొత్త కేసులకు ప్రధాన కాంటాక్ట్ కోయంబేడు మార్కెట్ అని తేలింది. దీంతో చిత్తూరు పట్టణ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరుముద్దలు పెట్టిన మహిళా పోలీస్.. వీడియో కాల్ చేసి అభినందించిన చిరంజీవి