బ్రిటన్లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ స్ట్రెయిన్ ఇపుడు చాపకింద నీరులా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 30 దేశాల్లో అడుగుపెట్టిన ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ప్రజలు వణికిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. అటు వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఇది తొలినాటి వైరస్ కంటే మరింత వేగంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్త స్ట్రెయిన్తో అప్రమత్తమైన పలు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతోపాటు విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు వైరస్ ఉనికిలో ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాయి.
శనివారం వియత్నాంలో బ్రిటన్ వైరస్కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఇటీవల యూకే నుంచి వచ్చిన మహిళలో ఈ వైరస్ను గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆమెను ఐసోలేషన్కు తరలించారు.
కాగా, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇప్పటికే నిషేధం విధించిన వియత్నాం.. యూకేలోని తమ పౌరుల కోసం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చిన 15 మందిలో కొత్త వైరస్ లక్షణాలను గుర్తించినట్టు మొన్న టర్కీ ప్రకటించింది. ఐర్లండ్లోనూ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
అటు అమెరికాలో ఇప్పటి వరకు మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ వైరస్ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాపించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండడంతో గుర్తించలేకపోతున్నారు.
ఇప్పటికే కరోనా వైరస్తో అల్లాడిపోతున్న అమెరికాలో కొత్త వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వైరస్ వెలుగు చూసిన బ్రిటన్లో దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, పార్క్లను మూసివేసింది.