Publish Date: Wed, 24 Mar 2021 (11:30 IST)
Updated Date: Wed, 24 Mar 2021 (11:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి బ్రెజిల్లో మరణ మృదంగం మోగిస్తోంది. ఆ దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం ఒక్కరోజే 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్కు బలయ్యారు. మరోవైపు రోజువారి కరోనా కేసులు 84 వేలకుపైగా నమోదయ్యాయి.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య మూడు లక్షలకు చేరుకోగా.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా, కరోనా కట్టడిలో వైఫల్యం కావడంతో ఆరోగ్యశాఖ మంత్రిని ఆ దేశాధ్యక్షుడు బోల్సోనారో తొలగించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ విధించకపోవడం వల్లే కేసులు పెరిగినట్లు ఆ దేశ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి.