Publish Date: Wed, 13 Oct 2021 (20:38 IST)
Updated Date: Wed, 13 Oct 2021 (20:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఫంక్షన్లు, సభలు, సమావేశాలు, సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు గరిష్టంగా 250 మంది వరకు హాజరు కావొచ్చని తాజాగా తెలిపింది.
అయితే కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, తరచుగా శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.
అదేసమయంలో ఇక రాత్రి కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అయితే సమయాలను కాస్త కుదించింది. అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించింది.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 517 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 97 కొత్త కేసులు నమోదయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 84, కృష్ణా జిల్లాలో 71 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి.
అదేసమయంలో 826 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,37,691 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,615 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,276కి పెరిగింది.
ఠాగూర్
Publish Date: Wed, 13 Oct 2021 (20:38 IST)
Updated Date: Wed, 13 Oct 2021 (20:39 IST)