Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు పాజిటివ్ - తెలుగు రాష్ట్రాల్లో కరోనా దూకుడు

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:16 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. 
 
సీఎం రమేశ్‌కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. 
 
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ దూకుడుకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,207 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో  1,136 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఆసుపత్రుల్లో 21,417 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 53,239 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 601కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 196 కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి తీవ్రత మళ్లీ అధికమైంది. కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతున్న సూచనలు కనిపించినా, కొత్త కేసుల సంఖ్య మళ్లీ 10 వేలు దాటుతోంది. గడచిన 24 గంటల్లో 10,328 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
తూర్పు గోదావరి (1,351), కర్నూలు (1,285), అనంతపురం (1,112) జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,96,789కి చేరింది. 
 
అటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉంది. తాజాగా 72 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,753కి పెరిగింది. కొత్తగా 8,516 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 82,166 మంది చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే ఏడాది జూలై వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చు.. ఫేస్‌బుక్