చెన్నైలో గంజాయి చాక్లెట్లున్నాయ్! తస్మాత్ జాగ్రత్త!
చెన్నైలో గంజాయి కలిపిన చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఈ తరహా చాక్లెట్లు ఒక్క చెన్నైలోనే కాదు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు చదువుకునే విద్యాలయాల వద్ద ఇబ్బడిముబ్బ
Publish Date: Fri, 08 Jul 2016 (09:47 IST)
Updated Date: Fri, 08 Jul 2016 (10:38 IST)
చెన్నైలో గంజాయి కలిపిన చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఈ తరహా చాక్లెట్లు ఒక్క చెన్నైలోనే కాదు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు చదువుకునే విద్యాలయాల వద్ద ఇబ్బడిముబ్బడిగా అమ్మకాలు జరుగుతున్నాయి... ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం ఇటీవల తండయార్పేటకు చెందిన నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు దుకాణాల్లో తనిఖీలు చేయడంతో అసలు గుట్టురట్టయ్యింది.
అయితే ఈ గంజాయి చాక్లెట్లు చెన్నైలో మాత్రమేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్టుగా పలు ఆధారాలు బహిర్గతం చేస్తున్నాయి. తండయార్పేట, వాషర్మెనపేటలలోనే సుమారు 50 దుకాణాల వారు ఈ మత్తు చాక్లెట్లు అమ్ముతున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అయితే నగరవ్యాప్తంగా ఈ చాక్లెట్ల విక్రయాలు జరుగుతున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీనిపై అధికారులు సీరియస్గా ఉన్నారు. ఎలాగైనా ఈ చాక్లెట్లను సరఫరా చేస్తున్న వారిని అరికట్టి ఉక్కుపాదం మోపేందుకు వ్యూహం రచిస్తున్నారు.
నగరంలో మాత్రమే ఈ చాక్లెట్లు విక్రయమవుతున్నట్టు భావిస్తున్న అధికారులకు దిగ్ర్భాంతి గొలిపే సంఘటన తెలిసింది. కోయంబత్తూర్లోని వుక్కడమ్ - సెల్వపురమ్ రోడ్డు పక్కన అట్టపెట్టెలో దాచిన చాక్లెట్లు పడి వున్నట్టు సమాచారం తెలిసింది. విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు విక్రయించిన దుకాణాన్ని తండయార్పేట వాసులు ధ్వంసం చేశారు. తండయార్పేటలోని కార్పొరేషన్ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు ఇటీవల చాక్లెట్లు తిని అస్వస్థతకు గురయ్యారు. వీరికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు గంజాయి కలిపిన చాక్లెట్లు తినడంవల్లేనని నిర్ధారించారు.
ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసిన ఆహార భద్రతావిభాగం అధికారులు వారు నిర్వహిస్తున్న దుకాణాల్లో విక్రయించే చాక్లెట్లను స్వాధీనం చేసుకొని పరిశోధనలకు పంపించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా మూసి ఉంచిన సురేష్ మహాదేవన్ అనే నిందితుడి దుకాణాన్ని ఆయన భార్య గురువారం ఉదయం తెరిచారు. ఇది గమనించిన స్థానికులు ఆ దుకాణంపై దాడికి దిగి వస్తువులను బయటకు విసిరివేశారు. దీనిపై అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొన్న ఆర్కే నగర్ పోలీసులు ఆందోళనకారులను అక్కన్నుంచి వెళ్లగొట్టారు. దీనిపై నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.