Publish Date: Thu, 21 Jan 2016 (14:42 IST)
Updated Date: Thu, 21 Jan 2016 (15:02 IST)
గత కొన్ని రోజులుగా తమిళనాడు సముద్రతీరంలో చనిపోతున్న తిమింగలాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా కూడన్కుళం అణు విద్యుత్ ప్లాంట్ ఉన్న తిరునెల్వేలి జిల్లాతో పాటు తూత్తుకుడి సముద్ర తీరంలో ఒడ్డుకు భారీ తిమింగలాలు ఒడ్డుకుకొట్టుకుని వస్తున్నాయి. ఇప్పటికే అనేక తిమింగలాలు చనిపోయాయి కూడా.
ఈ నేపథ్యంలో తూత్తుకుడిలో జిల్లాలోని తిరుచెందూర్, మనప్పాడు, ఆలందలై సముద్రతీరాన వందకు పైగా తిమింగలాలు ఒడ్డుకు చేరుకున్నాయి. వీటిలో 30కి పైగా చిన్నతిమింగలాలు చనిపోయి వాటి కళేబరాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇలా ఒడ్డుకు కొట్టుకొస్తున్న తిమింగలాలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టేందుకు భారీ క్రేన్లను వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఒక్కో తిమింగలం బరువు వెయ్యి నుంచి 1500 కేజీల వరకు ఉండటంతో వీటిని ఉపయోగించాల్సి వస్తోంది.
అయితే, సముద్రం అడుగుభాగంలో ఉండే ఈ తిమింగలాలు ఒడ్డుకు రావడానికి ధ్వని శబ్ధం ఓ కారణంగా చెపుతున్నారు. అలాగే, కూడన్కుళం అణు విద్యుత్ ప్లాంట్ నుంచి విడుదల చేసే నీరు సముద్రంలోకి వదిలిపెట్టడం వల్ల ఆ వేడిని తట్టుకోలేక ఈ తిమింగలాలు ఒడ్డుకుకొట్టుకుని వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.