Publish Date: Mon, 12 Jul 2021 (19:41 IST)
Updated Date: Mon, 12 Jul 2021 (19:42 IST)
జాతీయ స్థాయిలో వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే 'నీట్' (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) సెప్టెంబరు 12న నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
'నీట్' రాయాలనుకునే వారు ఎన్టీయే వెబ్ సైట్ (neet.nta.nic.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ప్రకటన చేశారు.
గతేడాది కంటే ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపారు. 2020లో దేశవ్యాప్తంగా 3,862 పరీక్ష కేంద్రాల్లో 'నీట్' నిర్వహించామని, ఈసారి వాటి సంఖ్యను పెంచుతామన్నారు. అంతేకాకుండా, 'నీట్' జరిగే నగరాలు, పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.