Publish Date: Fri, 05 Jul 2024 (14:54 IST)
Updated Date: Fri, 05 Jul 2024 (14:55 IST)
దేశంలో వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నీట్-పీజీ 2024 పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11వ తేదీన ఈ పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టంచేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్ 23వ తేదీన జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించారు. ఆన్లైన్లో నిర్వహించబోయే నీట్-పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా ఇటీవల కథనం వెల్లడించింది. అయితే, ఇది సాధ్యపడుతుందా అని పలువురు విద్యా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే, నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ కావడంతో పీజీ పరీక్షకు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు.