Publish Date: Fri, 02 Dec 2022 (10:21 IST)
Updated Date: Fri, 02 Dec 2022 (10:22 IST)
ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్సీ 12వ తరగతి బోర్డ్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ను కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ విడుదల చేసింది. వచ్చే యేడాది నిర్వహించే ఈ పరీక్షల షెడ్యూల్ను వెల్లడించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీఐఎస్సీఈ 2023 డేట్ షీట్ను cisce.org ద్వారా చెక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.
వచ్చే యేడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలను నిర్వహించనుండగా, ఫిబ్రవరి 12 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఐఎస్సీ 12వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 2023లో ఫలితాలను వెల్లడిస్తారు. వెబ్సైట్లో పూర్తి షెడ్యూల్ను అందుబాటులో ఉంచింది.
పరీక్షా హాలుకు వచ్చే విద్యార్థులు నిర్ధేశిత సమయానికి 5 నిమిషాలు ముందుగానే రావాలని సూచించింది. ఆలస్యంగా వచ్చేవారు అందుకు సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. అరగంటకు పైగా ఆలస్యమైతే ప్రశ్నపత్రం ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే, పరీక్షా సమయం ముగిసేంత వరకు ఎగ్జామ్ హాలులోనే వేచివుండాలని తెలిపింది.