భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా, రూ.500 కరెన్సీ నోట్లను నిలిపివేసినట్టు సాగుతున్న విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రూ.500 నోట్లను నిలిపివేసినట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత నిజం కూడా లేదని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని పేర్కొన్నారు.
2025 సెప్టెంబర్ 30 నాటికి ఏటీఎంల నుంచి రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని ఓ సందేశం వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. 2026 మార్చి 31 నాటికి 90 శాతం, సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో ఈ నోట్ల పంపిణీ ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 500 నోట్లను మార్చుకోవాలని, భవిష్యత్తులో ఏటీఎంలలో కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కూడా అందులో ఉంది.
ఈ వైరల్ సందేశంపై ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఆర్బీఐ అలాంటి సూచనలేవీ చేయలేదని, రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. "సెప్టెంబర్ 2025 నాటికి ఏటీఎంల నుంచి రూ.500 నోట్ల పంపిణీని నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరిందా? ఈ మేరకు వాట్సాప్లో వ్యాపిస్తున్న సందేశం పూర్తిగా అవాస్తవం. ఆర్బీఐ నుంచి అలాంటి ఆదేశాలు జారీ కాలేదు. రూ.500 నోట్లు చెల్లుబాటులోనే కొనసాగుతాయి" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన పోస్టులో పేర్కొంది.