దేశ వ్యాప్తంగా ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించే అంశంపై ఇండిగో సంస్థ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులకు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు ప్రక్రియ పూర్తయ్యేలా దృష్టిసారించినట్టు తెలిపింది.
అలాగే, ఇండిగో విమానల రద్దు సంక్షోభానికి సంబంధించి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమైనట్లు వెల్లడించింది. సమస్యకు కారణమైన అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపింది. సీఈవో, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ (సీఎంజీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఈ గ్రూప్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఇదేక్రమంలో సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు అండగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్లు, రీషెడ్యూలింగ్లపై మినహాయింపులు ఇచ్చేందుకు బోర్డు సభ్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొంది.