ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇది నిజంగానే శుభవార్త. తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. వచ్చే యేడాది జనవరి నెల నుంచి ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు మనీ కంట్రోల్ అనే సంస్థ వెల్లడించింది. ఈ సమావేశం అక్టోబరు రెండో వారంలో జరుగనుందని మనీ కంట్రోల్ పేర్కొంది.
ఏటీఎం నగదు విత్డ్రా సదుపాయాన్ని ఈ ఏడాది జూన్ నుంచే అందుబాటులోకి తేనున్నట్లు కార్మికశాఖ తొలుత ప్రకటించింది. ఇందుకోసం దీనికి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేసింది. అయితే, విత్డ్రాలకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిమితి విధించకపోతే 'భవిష్యనిధి' అసలు లక్ష్యం నీరుగారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బోర్డు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు 7.8 లక్షల మంది చందాదారులు ఉన్నారు. వీరికి చెందిన సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్ఓ వద్ద ఉంది. అయితే, అత్యవసర సమయాల్లో వ్యక్తుల నగదు అవసరాలను తీర్చడానికి పీఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకునే సదుపాయం తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.
ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సిద్ధం చేయడంతో పాటు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, ఆర్బీఐతో కూడా కార్మికశాఖ చర్చిచింది. ఏటీఎం తరహాలో ప్రత్యేక కార్డును సభ్యులకు ఈపీఎఫ్ఓ జారీ చేయనుంది. ఏటీఎం కార్డులా ఈ కార్డు పనిచేస్తుంది. ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విత్డ్రాలకు సంబంధించి మరింత స్పష్టత రానుంది.