ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో డిజిటల్గా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులుచేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ 3.0ను అందుబాటులోకి తెచ్చి పీఎఫ్ సేవలను మరింత సులభతరం చేస్తామని కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈపీఎఫ్ఓ 3.0తో దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్లమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇది మే లేదా జూన్ నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈపీఎఫ్వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు, డిజిటల్ కరెక్షన్లు, ఏటీఎం ద్వారా విత్ డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈపీఎఫ్వోను మరింత సౌకర్యవంతంగా, సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమ్నారు.
క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వెర్షన్తో తొలగబోనున్నాయని మంత్రి తెలిపారు. వేగవంతమైన సెటిల్మెంట్లు వల్ల డబ్బులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో త్వరలో జమ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలు ఈపీఎఫ్వో కలిగివుందని, ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీని అందిస్తోందని చెప్పారు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించామని, దీనివల్ల 78 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు.