Publish Date: Mon, 06 Apr 2026 (16:26 IST)
Updated Date: Mon, 06 Apr 2026 (16:27 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. ఒక్క రూపాయికే ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది. 30 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ వల్ల తమ మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.
నిజానికి గత యేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్ పేరుతో ఓ ఫ్రీడమ్ ప్లాన్ను తెచ్చింది. ఈ ప్లాన్ను మళ్లీ తీసుకొచ్చింది. అయితే, ఈ ప్లాన్ కావాలనుకుంటే మాత్రం ఈ నెల 30వ తేదీలోపు పొందాల్సివుంటుంది. ఇందులోభాగంగా, కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అపరిమిత సేవలను పొందవచ్చు. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ ప్లాన్లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, రోజుకు 2జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా రిటైలర్ను సందర్శించొచ్చు.