Publish Date: Mon, 23 Feb 2026 (20:56 IST)
Updated Date: Mon, 23 Feb 2026 (20:58 IST)
బెంగళూరు: ఆసియాలోనే తమ రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించినట్లు అమెజాన్ ఈరోజు ప్రకటించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో, 12 అంతస్తుల్లో నిర్మించిన ఈ క్యాంపస్... ఈకామర్స్, ఆపరేషన్స్, పేమెంట్స్, టెక్నాలజీ మరియు సెల్లర్ సర్వీసెస్ (విక్రేతల సేవలు) వంటి వివిధ విభాగాలకు చెందిన 7,000 మందికి పైగా ఉద్యోగులకు వసతి కల్పిస్తుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, ఐదు ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ కార్పొరేట్ భవనాన్ని.. కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఎం.బి. పాటిల్ అధికారికంగా ప్రారంభించారు.
ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఒకేచోట కలిసి పనిచేసేలా, సౌకర్యవంతంగా ఉండేలా, మరియు వారి శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్పొరేట్ భవనాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించారు. భారతదేశంలో అమెజాన్ నిరంతరం చేస్తున్న పెట్టుబడులలో భాగంగానే ఈ కొత్త క్యాంపస్ ప్రారంభించబడింది. సంస్థ ఇప్పటికే భారతదేశంలో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 2030 నాటికి దేశంలో అదనంగా మరో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఎం.బి. పాటిల్ మాట్లాడుతూ.. బెంగళూరులో అమెజాన్ నిరంతరం చేస్తున్న పెట్టుబడులు.. గ్లోబల్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్గా మారుతున్న భారతదేశ పాత్రను ప్రతిబింబిస్తున్నాయి. భారీ స్థాయి కార్పొరేట్ క్యాంపస్ల ద్వారా అమెజాన్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మరియు అధునాతన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు ఇవి గణనీయంగా తోడ్పడతాయి. మా రాష్ట్రం ప్రపంచ స్థాయి ప్రతిభకు, సౌకర్యాలకు కేంద్రంగా నిలుస్తోంది అనడానికి ఈ విస్తరణ మరొక నిదర్శనం. మా భాగస్వామ్యాన్ని భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నాము, అని అన్నారు.
అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ.. అమెజాన్కు భారతదేశం ఎల్లప్పుడూ దీర్ఘకాలిక ప్రాధాన్యతగా కొనసాగుతుంది. ఇక్కడ మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ఇన్నేళ్లుగా, మా ప్రారంభ సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయంగా ఉంది. నేటికీ ఇది ఆవిష్కరణలు మరియు అత్యుత్తమ ప్రతిభకు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. ఈ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ ఎం.బి. పాటిల్ గారికి, అలాగే కర్ణాటక ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు మా కృతజ్ఞతలు. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం మేము సేవలు విస్తరిస్తున్న తరుణంలో.. మౌలిక సదుపాయాలు, సాంకేతికత మరియు ప్రతిభపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము అని అన్నారు.
ఈ క్యాంపస్.. అనుకూలమైన వర్క్స్పేస్లను మరియు కొల్లాబరేటివ్ జోన్లను ఒకేచోట చేర్చింది. 200 మందికి పైగా పాల్గొనగలిగే ఈవెంట్ స్పేస్లు, మీటింగ్ రూమ్లు, హడిల్ స్పేస్లు మరియు బ్రేక్అవుట్ ఏరియాలు ఇందులో ఉన్నాయి. ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన వినోద సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బాస్కెట్బాల్ మరియు పికెల్బాల్ కోర్టులు, ఒక యాంఫీథియేటర్, పచ్చని లాన్లు మరియు బహిరంగ కమ్యూనిటీ స్థలాలు ఉన్నాయి. రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఫలహారశాలలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల వంటకాలను అందిస్తాయి.