Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడ: అనుమానంతో గర్భిణిగా ఉన్న భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త, ఉరిశిక్ష విధించిన కోర్టు

విజయవాడ: అనుమానంతో గర్భిణిగా ఉన్న భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త, ఉరిశిక్ష విధించిన కోర్టు
, గురువారం, 8 ఏప్రియల్ 2021 (20:46 IST)
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో భర్తకు ఉరిశిక్ష పడింది. గర్భిణిగా ఉన్న సమయంలో భార్యను ఆమె భర్త బత్తుల నంబియార్ అలియాస్ సుజిత్ ఇంట్లోనే హత్య చేసినట్లు నేరం నిరూపణ అయింది. దాంతో నంబియా‌ర్‌కు ఉరిశిక్ష విధిస్తూ విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

 
రెండేళ్ల క్రితం ఘటన
బత్తుల నంబియార్ గుడివాడ సమీపంలోని కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసేవాడు. బీఎస్సీ, బీఈడీ చదివి విజయవాడలోని ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎం శైలజతో అతనికి వివాహమైంది. కుటుంబానికి తోడుగా ఉంటూ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడికి కూడా ఆసరాగా నిలిచింది శైలజ. వివాహానంతరం నంబియార్ నిత్యం అనుమానంతో శైలజని వేధిస్తూ ఉండేవాడని మృతురాలి తల్లిదండ్రులు చెప్పారు.

 
వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తోందని పలుమార్లు శైలజ కుటుంబీకుల దగ్గర అతను పంచాయితీ పెట్టేవాడు. ఎన్నిసార్లు సర్ధి చెప్పినా వారి సంసారం సజావుగా సాగలేదు అని శైలజ తండ్రి మోహన్‌రావు బీబీసీతో అన్నారు.

 
"పెళ్లి చేసిన తర్వాత చక్కగా సంసారం చేసుకుంటారని ఆశించాం. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు కదా అని అనుకున్నాం. కానీ పెళ్లి తర్వాత అతను ఉద్యోగం కూడా మానేశాడు. మా అమ్మాయే పోషించేది. అయినా అనుమానంతో అందరి దగ్గర మాట్లాడేవాడు.

 
చాలాసార్లు నచ్చచెప్పినా మారలేదు. చివరకు 2019 జూన్ 15న తెల్లవారుజామున ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. నా కూతురు కేకలు విని వచ్చిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఒళ్లంతా బాగా కాలిపోవడంతో ఆమె చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉరిశిక్ష పడింది" అంటూ వివరించారు.

 
కుటుంబానికి పెద్ద దిక్కుగా...
తల్లిదండ్రులిద్దరూ ఊళ్లో ఉన్న సమయంలో ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడితో పాటుగా లబ్బీపేటలోని ఫకీర్ గూడెంలో అద్దె ఇల్లు తీసుకుని శైలజ నివశించేది. చిన్నవాళ్లంతా సెటిల్ అయ్యేందుకు తను చేదోడుగా నిలిచిందని ఆమె తండ్రి చెప్పారు. ఇద్దరు చెల్లెళ్ల పెళ్లికి కూడా సాయం చేసిందని అన్నారు.

 
"అనుమానంతోనే నా కూతురిని చంపేశాడు. పోలీసులు కూడా ఆధారాలతో పట్టుకున్నారు. అలాంటి వాళ్లకు ఉరిశిక్షే సరైనది. నా పెద్దకూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. ఇలాంటి దుర్మార్గం మళ్లీ ఎవరికీ జరగకూడదనే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం. మా కుటుంబంలో పెద్దదాన్ని మాకు దూరం చేసినందుకు తగిన శాస్తి జరగాల్సిందే" అంటూ మోహన్ రావు బీబీసీతో అన్నారు.

 
సాక్షులంతా నిందితుడికి వ్యతిరేకంగానే చెప్పారు..
ఆమెను పెట్రోల్ పోసి తగులబెట్టిన సమయంలో స్థానికులు కొందరు ఆమెను రక్షించేందుకు వెళ్లారని, వారు ఇచ్చిన సాక్ష్యాలే నిందితుడికి శిక్ష పడేందుకు తోడ్పడ్డాయని ప్రాసిక్యూషన్ తరుపున వాదించిన గరిమెళ్ల దైవ ప్రసాద్ బీబీసీతో అన్నారు.

 
"ఐపీసీ సెక్షన్ 302 కింద నమోదయిన కేసులో ప్రత్యేక కేసుగా భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన సమయంలో రక్షించడానికి అనేక మంది ప్రయత్నించారు. ఆ సందర్భంలో తనను పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించింది నంబియారే అంటూ మృతురాలు అందరికీ చెప్పింది. అందుకే 18 మంది సాక్షులు అదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. నిందితుడు అరెస్ట్ అయిన నాటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం కోర్టు విచారణ కోసం విజయవాడకు తీసుకొచ్చారు" అంటూ న్యాయవాది జీడీ ప్రసాద్ వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో ప్రైవేటు టీచర్లకు ఆపత్కాల సాయం.. బియ్యం కూడా : సీఎం కేసీఆర్