Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కి ప్రయత్నిస్తే జియో‌మార్ట్ ఓపెన్.. కారణం చెప్పిన టీటీడీ

తిరుమల: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కి ప్రయత్నిస్తే జియో‌మార్ట్ ఓపెన్.. కారణం చెప్పిన టీటీడీ
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:06 IST)
తిరుమల వెంకన్న దర్శనం కోసం ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకునే భక్తులనే కొండపైకి అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో గత ఏడాది జూన్ నుంచి దీనిని అమలు చేస్తున్నారు. అలిపిరి వద్ద టికెట్లను చూపించిన వారికి మాత్రమే ముందుకెళ్లే అవకాశం వస్తోంది. సర్వదర్శనం కూడా పూర్తిగా ప్రారంభించకపోవడంతో నేటికీ ఎక్కువ మంది రూ. 300 దర్శనం టికెట్ల తీసుకుని దర్శనాలకు వస్తున్నారు. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లోనే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 
శుక్ర, శనివారాల్లో ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ ఉంటుందని టీటీడీ ప్రకటన చేసింది. దానికి తగ్గట్టుగా రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా దర్శనం టికెట్ల కోసం ఆన్ లైన్‌లో ప్రయత్నాలు చేశారు. కానీ శుక్రవారం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్‌కు ప్రయత్నించిన చాలామందికి నిరాశే ఎదురైంది. టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల వెబ్‌సైట్ జియోమార్ట్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని పలువురు భక్తులు చెప్పారు. అయితే, మధ్యాహ్నానికి టీటీడీ దీనిపై స్పందించి జియో సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతానికి tirupatibalaji.ap.gov.in లేదా tirupatibalaji.jiomart.com లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

 
సాంకేతిక మార్పులకు సమయం తక్కువ కావడంతో, తిరుపతి బాలాజీ పేరుతో సబ్ డొమైన్ తీసుకు రావడం కుదరక టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్‌ని ల్యాండింగ్ పేజీగా వాడుతూ జియోమార్ట్ సబ్ డొమైన్‌కి రూట్ చేసినట్లు చెప్పారు. మళ్లీ టికెట్లు విడుదల చేసే సమయానికి ఈ సబ్ డొమైన్ కూడా తిరుపతి బాలాజీ పేరుతో ఉండబోతుందని తెలిపారు.

 
జియోమార్ట్ ఎందుకొచ్చింది..
టీటీడీ అధికారిక వెబ్ సైట్ క్లిక్ చేసి టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నం చేయగానే స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోసం ఇక్కడ క్లిక్ చేయమంటూ ఒక సూచిక వస్తోంది. దాని కిందనే కోవిడ్ కి సంబంధించిన పలు జాగ్రత్తలు కనిపించాయి. ముఖ్యంగా దర్శనం కోసం వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ వ్యాక్సినేషన్ జరగపోతే 72 గం.ల ముందు కోవిడ్ టెస్టులు చేయించుకుని నెగిటివ్ వచ్చిందనే సర్టిఫికెట్ దర్శనానికి వచ్చే సమయంలో చూపించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ రెండు నిబంధనలు పాటించిన తర్వాత టికెట్ బుకింగ్ చేయాలని సూచించారు.

 
దానికి అనుగుణంగా టికెట్ బుక్ చేసుకునేందుకు ముందుకు వెళితే https://tirupatibalaji.jiomart.com/ అంటూ మరో సైట్‌కు అది దారితీస్తోంది. అక్కడ టికెట్ బుక్ చేయాలనుకునే వారి మొబైల్ నెంబర్ సమర్పిస్తే ఆ తర్వాత ఇతర వివరాలు ఇవ్వాల్సి వస్తోంది. అయితే టీటీడీ కి చెందిన ప్రభుత్వ వెబ్ సైట్ ఉండగా జియో మార్ట్ అంటూ దర్శనం కోసం వచ్చే వారి వివరాలు సేకరించే ప్రయత్నం జరగడం పలు సందేహాలకు తావిస్తోంది.

 
‘ఎంత ప్రయత్నించినా జియోమార్టే ఓపెన్ అవుతోంది’
ఉదయం 9గం. ల నుంచి టికెట్లు బుక్ చేద్దామని ఆన్ లైన్లో చాలా ప్రయత్నం చేశాను. కానీ సైట్ ఓపెన్ కాలేదు. క్లిక్ హియర్ అనే దగ్గర నొక్కగానే జియోమార్ట్ సైట్ చూపించింది. అక్కడ కూడా బుకింగ్ అవ్వలేదు. టెక్నికల్ రీజన్స్ తో సైట్ డౌన్ అయిపోయింది. గంట పాటు ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. ప్రతీసారి జియో మార్ట్ అని సైట్ రావడం, అక్కడే ఆగిపోవడం జరిగింది. చివరకు నెట్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ కూడా అదే పరిస్థితి. మా బాబుకి పుట్టి వెంట్రుకలు తీయించాల్సి ఉంది. దాంతో దర్శనానికి వెళ్లాలనుకున్నాం. తీరా చూస్తే దర్శనం టికెట్లు దొరికేలా కనిపించడం లేదు అంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన వి.లలితేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 
సర్వదర్శనం టోకెన్ల సంగతేంటి
రూ. 300 దర్శనం టికెట్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక శనివారం ఉదయం సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్ లైన్‌లోనే విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ 25 ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8,000 మందికి అవకాశం కల్పిస్తూ సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

 
సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామని కూడా తెలిపారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా సంక్రమించే ప్రమాదం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విషయంలోనే భక్తులకు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే ఇక సర్వదర్శనం కోసం మరింత మంది పోటీ పడే అవకాశం ఉంటుంది. అప్పుడు టీటీడీ ఆన్ లైన్ సైట్లు ఏమేరకు ఉపయోగపడతాయన్నది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.

 
శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన
సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం యాత్రికులకు అసౌకర్యంగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతిలో దర్శనం టికెట్ల కోసం వేచి చూస్తున్న వారికి నిరాశ ఎదురైంది. రేపటి నుంచి కేవలం ఆన్ లైన్లో మాత్రమే దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తుండగా తమ పరిస్థితి ఏమిటంటూ వారంతా ఆందోళనకు దిగారు. శ్రీనివాసం సర్వదర్శనం టికెట్లు పంపిణీ చేసే కౌంటర్ల ముందు భైఠాయించారు.

 
‘సామాన్యులకు ఆన్ లైన్‌లో టికెట్లు తీసుకోవడం ఎలా సాధ్యం?’
‘‘రైల్వే టికెట్‌లు ఆఫ్ లైన్లో కూడా ఇస్తున్నారు. కానీ టీటీడీ మాత్రం కేవలం ఆన్ లైన్ మాత్రమే అనడం సరికాదు. దానివల్ల అవగాహన లేని వారికి ఇబ్బందులు వస్తున్నాయి. తిరుపతిలో టికెట్ దొరుకుతుంది కదా అని వచ్చేస్తే ఇక్కడ అందుకు భిన్నంగా అధికారులున్నారు. దానివల్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ పునరాలోచన చేయాలి. ఆన్ లైన్ టికెట్లతో పాటుగా ఆఫ్ లైన్లో కూడా టికెట్లు ఇచ్చేందుకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల’’ని తిరుపతికి చెందిన ధర్మపరిషత్ సభ్యుడు ఎం.శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. టీటీడీ కేవలం రూ 300 ప్రత్యేక దర్శనం టోకెన్లకు ప్రాధాన్యమివ్వడం సామాన్యులను ఆలయానికి దూరం చేస్తుందని ఆయన బీబీసీతో అన్నారు.

 
మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం
‘‘మూడు నెలల పాటు ప్రయత్నించాం. మేం మా మిత్రులు కలిసి తిరుమల వెళ్లాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. నలుగురు వ్యక్తులం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రయత్నిస్తే చివరకు ఒక్కరికి ఈ రోజు కుదిరింది. తీరా సైట్లోకి వెళ్లి టికెట్ బుక్ చేద్దామనుకునే లోగా అది డౌన్ అయిపోయింది. దాంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆఫ్ లైన్ టికెట్లన్నీ నిలిపివేసిన తర్వాత ఆన్ లైన్ సామర్థ్యం పెంచాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా ఉంది. దానివల్ల అనేక మంది సతమతమవుతున్నారు. టీటీడీ తగిన మార్పులు చేయాలి. మధ్యలో జియో మార్ట్ అంటూ సైట్ ఓపెన్ కావడం అనుమానంగా ఉంది. టీటీడీ టికెట్లను జియో వాళ్లు విక్రయిస్తున్నారా అనే అనుమానం వస్తోంది. స్పష్టతనిస్తే మంచిది’’ అని గుంటూరుకి చెందిన మోదుగుల రవీంద్ర రెడ్డి అభిప్రాయపడ్డారు.

 
జియోతో ఒప్పందం: టీటీడీ
దర్శనం టికెట్ల విషయమై ఏర్పడిన గందరగోళం, ఆన్ లైన్‌లో సమస్యలు , జియో మార్ట్ సైట్ విషయమై టీటీడీ నుంచి అధికారిక వివరాల కోసం బీబీసీ ప్రయత్నించింది. టీటీడీ టికెట్ల ఆన్‌లైన్ విక్రయ సేవల కోసం జియో సంస్థ క్లౌడ్ టెక్నాలజీ ద్వారా సాంకేతిక సహాయం అందిస్తోందని, జియో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందని టీటీడీ అధికారి ఒకరు చెప్పారు.

 
అనంతరం టీటీడీ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టీటీడీ వెబ్‌సైట్ లో రద్దీ సమస్య పరిష్కారమైనట్లు తెలిపింది. రిలయన్స్ జియో సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించేందుకు టీటీడీతో ఒప్పందం కుదిరిందని.. రిలయన్స్ జియో ఈ సేవలను ఉచితంగా అందిస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు. గతంలో ఉన్న టీసీఎస్ సర్వర్లు రద్దీకి తట్టుకోలేకపోవడంతో జియో‌ను సర్వీస్ ప్రొవైడర్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు నుంచే జియో సర్వర్లకు మారినట్లు తెలిపారు.ప్రస్తుతం tirupatibalaji.ap.gov.in లేదా tirupatibalaji.jiomart.com లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోటోగ్రాఫర్ ఎంత పని చేశాడు.. గాయపడిన నిరసనకారుడిని తన్నడం, కొట్టడం..?