Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెడ్డీ బేర్: పెళ్లి గిఫ్ట్‌గా బాంబ్‌ను పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు

Teddy Bear
, మంగళవారం, 24 మే 2022 (22:54 IST)
‘‘నా పెద్ద కూతురిని రాజేశ్ ఏడేళ్లపాటు మోసం చేశాడు. ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. ఇప్పుడు నా చిన్న కూతురి పెళ్లికి అతడు ఒక గిఫ్ట్ పంపించాడు. అందులో బాంబు ఉంది. అది పేలిపోవడంతో మా అల్లుడి కళ్లు పోయాయి. ఆడపిల్ల తండ్రిగా నేను ఇప్పుడు ఏం చేయగలను. మా అల్లుడికి నా కళ్లలో ఒకటి ఇచ్చేస్తాను.’’ ఇవి హరీశ్ దల్వీ మాటలు. ఆయన చిన్న కుమార్తెకు తాజాగా వివాహమైంది. పెళ్లి తర్వాత రెండో రోజు తమకు వచ్చిన గిఫ్ట్‌లు అల్లుడు ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక దాంట్లో బాంబు పేలింది.

 
నవ్‌సారీ జిల్లా వంసదా ప్రాంతం మింద్‌భారీ గ్రామానికి చెంది హరీశ్ దల్వీ తన చిన్న కుమార్తె సల్మాకు ఆడంబరంగా పెళ్లి చేశారు. పెళ్లి అంతా చక్కగా ముగిసినందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తంచేశారు. అయితే, పెళ్లి అయిన రెండో రోజు ఆయనకు కుమార్తె సల్మా నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మా ఇంట్లో ఒక బాంబు పేలింది. నా భర్త లతీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి’’అని ఫోన్‌లో ఆమె చెప్పారు. ‘‘నేను ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుండగా.. మా చిన్నమ్మాయి ఫోన్ చేసింది. వెంటనే నేను అక్కడకు వెళ్లాను. అక్కడ నా చిన్న అల్లుడు, ఆయన మేనల్లుడు జియాన్ష్ తీవ్ర గాయాలతో కనిపించారు. ఇళ్లంతా రక్తమే కనిపించింది’’అని బీబీసీతో హరీశ్ చెప్పారు.

 
‘‘నా కళ్లలో ఒకటి ఇచ్చేస్తాను’’
‘‘పేలుడు తర్వాత ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర అయ్యాయి. వెంటనే లతీశ్, ఆయన మేనల్లుడులను ఆసుపత్రికి తీసుకెళ్లాం. వారు గిఫ్ట్‌లను ఓపెన్ చేస్తున్నారు. అప్పుడే టీ తీసుకొచ్చేందుకు మా అమ్మాయి, ఆమె వదిన వంటగదిలోకి వెళ్లారు. అప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. వెంటవెంటనే అందరూ పరుగుపరుగున వచ్చి చూశారు. గిఫ్ట్‌గా వచ్చిన ఒక టెడ్డీబేర్‌ను ఎలక్ట్రిక్ సాకెట్‌లో పెట్టడంతో అది పేలిపోయింది. దాని వల్ల మా అల్లుడు, ఆయన మేనల్లుడులకు తీవ్ర గాయాలయ్యాయి’’అని హరీశ్ వివరించారు.

 
‘‘మా పెద్దమ్మాయి జాగృతి స్నేహితురాలు ఆరతి ఆ బహుమతిని ఇచ్చారని తెలిసింది. మేం ఆమెను అడిగాం. అయితే, ఆ గిఫ్ట్‌ను రాజేశ్ పటేల్ ఇచ్చారని ఆమె చెప్పారు. జాగృతికి ఆ గిఫ్ట్ ఇవ్వమని చెప్పారని ఆమె వెల్లడించారు. ఈ రాజేశ్ మా పెద్దమ్మాయి జాగృతి జీవితాన్ని నాశనం చేశాడు. అతడి వల్ల మా అమ్మాయికి ఒక పాప కూడా పుట్టింది’’అని హరీశ్ చెప్పారు. ‘‘మా పెద్దమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తే ఈ పని చేసుంటాడని మేం ముందే ఊహించాం. మా అనుమానం నిజమైంది. ఇప్పుడు అతడు మా చిన్నమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తున్నాడు. నా అల్లుడు ఎడమ చెయ్యి బాంబు పేలుడుకు పూర్తిగా దెబ్బతింది. అతడు కళ్లను కూడా కోల్పోయాడని డాక్టర్లు చెబుతున్నారు’’ అని హరీశ్ వివరించారు.

 
‘‘మా అల్లుడి కోసం నేను ఇప్పుడు ఏం చేయాలి. నా రెండు కళ్లలో ఒకటి అతడికి ఇచ్చేస్తాను’’అని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం హరీశ్ పెద్ద కుమార్తె జాగృతి స్నేహితురాలు ఆరతిని ప్రశ్నించాం. తనకు రాజేశ్ పటేల్ ఆ గిఫ్ట్ ఇచ్చాడని ఆమె చెప్పారు. ఈ గిఫ్ట్‌ను జాగృతి కుమార్తెకు ఇవ్వమని అతడు సూచించాడు. రాజేశ్, జాగృతి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు. వీరికి ఒక కుమార్తె పుట్టింది’’అని ఈ కేసును విచారణ చేపడుతున్న పోలీసు అధికారి వీరేంద్రసింగ్ వాఘేలా వెల్లడించారు. ‘‘తన నుంచి ఏ గిఫ్టూ జాగృతి తీసుకోవడంలేదని రాజేశ్ ఏడ్చాడు. తన కుమార్తెకు ఎలాగైనా ఈ గిఫ్ట్ ఇవ్వాలని ఆరతికి రాజేశ్ సూచించాడు. జాగృతి చెల్లికి పెళ్లి అయిన రోజే రాజేశ్ ఈ గిఫ్ట్ ఇచ్చాడు’’అని ఆరతి చెప్పినట్లు వాఘేలా వివరించారు. ప్రస్తుతం రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

 
‘‘మా కుమార్తె జీవితం నాశనమైంది’’
‘‘మా అమ్మాయి జాగృతి, రాజేశ్ కలిసి పనిచేసేవారు. అప్పుడే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజేశ్ మోసం చేశాడు. అతడి వల్ల జాగృతికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత జాగృతిని పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు. దీంతో నా కుమార్తె మా ఇంటికి వచ్చేసింది’’అని హరీశ్ చెప్పారు. ‘‘జాగృతిని చంపేస్తానని రాజేశ్ బెదిరేంచేవాడు. అతడు అన్నంత పనిచేస్తాడని, మేం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం’’అని హరీశ్ వెల్లడించారు.

 
‘‘టెడ్డీబేర్‌లో డెటొనేటర్లు, జెలెటిన్ స్టిక్స్ పెట్టినట్లు ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరిశోధనలో వెల్లడైంది’’అని సూరత్‌కు చెందిన పోలీసు అధికారి రాజ్‌కుమార్ పాండియన్ చెప్పారు. ‘‘మేం రాజేశ్‌ను ప్రశ్నించాం. తన స్నేహితుడు మహేశ్ దగ్గర నుంచి వాటిని కొనుగోలు చేసినట్లు అతడు వెల్లడించాడు. మహేశ్.. రాళ్లను బాంబుల సాయంతో బద్దలుకొట్టే సంస్థలో పనిచేస్తాడు’’అని ఆయన తెలిపారు. ‘‘ఎలక్ట్రిక్ ప్లగ్‌లో పెట్టిన వెంటనే టెడ్డీబేర్ పేలిపోయేలా ఆ గిఫ్ట్‌ను తయారుచేశారు. దీన్ని తన స్నేహితురాలు ఆరతి ద్వారా జాగృతికి రాజేశ్ పంపిచాడు’’అని పాండియన్ చెప్పారు.

 
‘‘రాజేశ్‌కు ఇదివరకే పెళ్లి అయ్యింది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాగృతితోనూ ఆయన ఏడేళ్లపాటు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. కానీ, పెళ్లి చేసుకోలేదు. వీరికి ఒక కుమార్తె ఉంది’’అని పాండియన్ వివరించారు. ‘‘తనను పెళ్లి చేసుకోవాలని జాగృతి పదేపదే రాజేశ్‌ను అడిగేది. వీరిద్దరూ ఒక న్యాయవాదిని కూడా కలిశారు. అయితే, ఈ పెళ్లి కుదరదని ఆ న్యాయవాది తేల్చిచెప్పారు. దీంతో అతడిని వదిలేసి ఆరేళ్ల కూతురితోపాటు జాగృతి తన పుట్టింటికి వెళ్లిపోయింది’’అని పాండియన్ పేర్కొన్నారు.

 
‘‘ఈ పరిణామాల తర్వాత జాగృతిని చంపేస్తానని రాజేశ్ బెదిరించేవాడు. ప్రస్తుతం రాజేశ్ స్నేహితుడు మహేశ్‌ను కూడా మేం అరెస్టు చేశాం’’అని పాండియన్ వెల్లడించారు. ఈ ఘటనపై లతీశ్ సోదరి అమిత బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మా మరదలి అక్కతో రాజేశ్‌కు గొడవలు ఉన్నాయి. కానీ, ఇందులో మా తమ్ముడు ఏం చేశాడు? అతడి రెండు చేతులు, కళ్లు పోయాయి. మా తమ్ముడి జీవితమే నాశనమైంది’’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజేశ్ లాంటి వ్యక్తులు ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్‌ లాంటి వ్యాధులతో బాధపడుతుంటారు. నాకు దక్కనిది వేరెవరికీ దక్కకూడదని వారు భావిస్తారు. తను ప్రేమించిన వారు తనని వదిలి వెళ్లిపోతే వారు ఎంతకైనా తెగిస్తారు’’అని మానసిక వ్యాధుల నిపుణుడు ప్రశాంత్ భిమానీ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లో చేస్తే.. కుళ్లిన మాంసం వచ్చింది.. పెళ్లి ఆగిపోయింది..