Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరేంద్ర మోదీ: ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు

నరేంద్ర మోదీ: ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు
, మంగళవారం, 12 మే 2020 (20:20 IST)
ఒక్క వైరస్ ప్రపంచం మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు కూడా అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఇంకా ఏమన్నారంటే... కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం నాలుగు నెలలుగా సాగుతోంది.

 
ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యావత్తు ప్రపంచం ఒక రకమైన యుద్ధం చేస్తోంది. ఇదివరకు ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. వినలేదు.

 
మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది. కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు. మనల్ని మనం కాపాడుకోవాలి. ముందుకు సాగాలి. కరోనా సంక్షోభం మొదలైనప్పుడు భారత్‌లో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. ఎన్ 95 మాస్కులు నామమాత్రంగా ఉత్పత్తయ్యేవి. కానీ ఇప్పుడు భారత్‌లో ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారుచేస్తున్నాం.

 
ఆపదను అవకాశంగా భారత్ మార్చుకోవడంతోనే ఇది సాధ్యమైంది. మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది. 21వ శతాబ్దం భారతదేనని మనం గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం. కరోనావైరస్ సంక్షోభానికి ముందు పరిస్థితులను చూశాం. తర్వాత పరిస్థితులను చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే, 21వ శతాబ్దం భారత్ కల మాత్రమే కాదు, బాధ్యత కూడా.

 
ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి స్వయంశక్తి భారతే దీనికి మార్గమని చెబుతోంది. ఆర్థిక కేంద్రిత గ్లోబలైజేషన్ స్థానంలో మానవ కేంద్రిత గ్లోబలైజేషన్ గురించి చర్చ ఇప్పుడు సాగుతోంది.

 
ఇప్పటివరకూ ఏం జరిగింది?
భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనావైరస్‌ మహమ్మారికి సంబంధించి ఐదోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మార్చి 24 నుంచి అమల్లో ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. రెండోసారి విధించిన లాక్ డౌన్ వాస్తవానికి మే 3తో ముగియాల్సి ఉండగా, మరో రెండువారాల పాటు పొడిగిస్తూ మే 1న హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

 
మే 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 10కి పైగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే మే 12 నుంచి రైలు ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. మే 15 లోపు దేశీయ విమానాలను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

 
ఈ నేపథ్యంలో మోదీ లాక్ డౌన్‌ను మరోసారి పొడిగిస్తారా లేక, లాక్ డౌన్ ఎత్తివేసేందుకు అవసరమైన ప్రణాళికలను వెల్లడిస్తారా అనేది వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుంది: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు