Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలి: సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలి: సుప్రీంకోర్టు
, సోమవారం, 25 జనవరి 2021 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకోలేమని, సహకరించబోమని చెప్పిన ఏపీ ఉద్యోగ సంఘాల తీరునూ కోర్టు తప్పుపట్టింది. ఉద్యోగులు పనిచేయకుండా పిటిషన్ వేయడం ప్రమాదకరమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

 
‘ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోం’
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించగా.. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ కూడా ధర్మాసనంలో ఉన్నారు.

 
‘కరోనా తీవ్రంగా ఉన్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి’
''ఉద్యోగ సంఘాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. కరోనావైరస్ తీవ్రత ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు.. కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు...'' అని జస్టిస్ కౌల్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ''పశ్చిమబెంగాల్లో ఎన్నికల కోసం మేమే ఆదేశాలిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఆపాలని ఎలా చెప్పాలి?'' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ''రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలో కోర్టు చెప్పాలా? ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు. కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి'' అని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.

 
‘ఎస్ఈసీ తన విధిలో భాగంగా ఎన్నికలు నిర్వహిస్తారు’
పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేశారని రోహత్గి ధర్మాసనానికి నివేదించారు. అయితే.. ఎన్నికలు ప్రతిసారీ వాయిదా పడుతూ వస్తున్నాయని, ఎస్ఈసీ తన విధిలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ చేపడతారని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాడి కేసులో డుమ్మాకొట్టిన అసదుద్దీన్... నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ