Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల ఫలితాలు 2024: హరియాణా, జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Election Results 2024

బిబిసి

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (09:26 IST)
హరియాణా, జమ్మూకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హరియాణాలో కాంగ్రెస్ 47 స్థానాలలోనూ, బీజేపీ 23 స్థానాలలోనూ, ఇతరులు 4 స్థానాలలోనూ ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో జేకేఎన్సీ 36 స్థానాలలోనూ, పీడీపీ 3 స్థానాలు, బీజేపీ 22 చోట్ల, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రెండు రాష్ట్రాల్లోనూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎవరికివారు ధీమాగా ఉన్నారు.
 
హరియాణాలో మూడోసారి తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ముఖ్యమంత్రి నాయిబ్ సింగ్ సైనీ చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఇంటికి అభిమానులు చేరుకుంటున్నారు. ఈసారి హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, 60కుపైగా స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అభిమానులు మీడియాకు చెప్పారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 61 శాతం పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశలలో 90 స్థానాలకు అక్టోబర్ 1తో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో 63.88 శాతం ఓటింగ్ నమోదైంది. 10 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
 
హరియాణా
హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 46 సీట్లు సాధించాలి. చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతుందని అంచనావేశాయి. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 101 మంది మహిళలు ఉన్నారు.
 
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పంకజ్ అగర్వాల్ తెలిపారు. హరియాణా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్నివీర్ స్కీమ్‌ను ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చింది. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా నర్నౌల్ ఎన్నికల ప్రచార సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. "అగ్నివీర్ స్కీమ్ వల్ల హరియాణా ప్రత్యేకించి దక్షిణ హరియాణా బాగా నష్టపోయింది. అంతకు ముందు ప్రతీ ఏటా 5వేల మంది యువకులు సైన్యంలో చేరేవారు. అయితే ప్రస్తుతం 250 మంది మాత్రమే చేరుతున్నారు" అని అన్నారు.
 
భూపిందర్ సింగ్ హుడా వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అదే స్థాయిలో స్పందించారు. ఆయన భివానీ సభలో మాట్లాడుతూ " హరియాణాకు చెందిన ఒక్క అగ్నివీరుడైనా సైన్యం నుంచి వచ్చిన తర్వాత అతనికి ఉద్యోగం దొరక్కుండా ఉండదు. భారతీయ జనతా పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది" అని చెప్పారు.
 
జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్‌లో 20 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 90 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
 
జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను సాధిస్తామని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇచ్చాయి. బీజేపీ కూడా కేవలం బీజేపీ మాత్రమే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వగలదని ప్రచారం చేసింది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ కశ్మీర్‌లో 7 స్థానాలు, జమ్మూలోని 25 స్థానాల్లో పోటీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీర్‌లో 51 సీట్లు, జమ్మూలో 32 సీట్లలో పోటీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. ఎందుకో తెలుసా?