Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో 20 రోజుల కిందట వ్యాక్సిన్ తీసుకున్న 8 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్

Advertiesment
Covid positive
, బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:25 IST)
తెలంగాణలో కోవిడ్ టీకా తీసుకున్న వైద్య సిబ్బంది కొందరు కరోనా బారిన పడ్డారని.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలోని 8 మంది వైద్య సిబ్బందికి మంగళవారం కరోనా నిర్ధారణ అయిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

 
ఆ కథనం ప్రకారం.. 20 రోజుల క్రితం వీరు కోవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారని జిల్లా ప్రత్యేక ఉప వైద్యాధికారి ఉష చెప్పారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు వైద్యులు, ఆరుగురు సిబ్బంది కాగా.. ఒకరు మినహా అందరూ ఆపరేషన్‌ థియేటర్‌కు సంబంధించిన వారే. వీరిలో ఆరుగురు కోవిడ్‌ వార్డులో, ముగ్గురు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారిణి తెలిపారు.

 
ఇదిలావుంటే.. రాష్ట్ర పోలీసు సిబ్బందికి కరోనా వ్యాక్సీన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండగా.. ఇంకా 40 శాతం మంది కూడా వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. సిబ్బందిని చైతన్యపరిచేందుకు పలుచోట్ల ప్రత్యేక అధికారులను నియమించారు.

 
రాష్ట్రంలో దాదాపు 60 వేల మంది పోలీసు సిబ్బందికి వ్యాక్సీన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. శాఖలో చాలామంది సిబ్బందికి రక్తపోటు, మధుమేహం తదితర అనారోగ్య సమస్యలున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ వేయించుకుంటే దుష్పరిణామాలు ఏవైనా ఉంటాయేమో అనే భయంతో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

 
రాష్ట్రంలో మంగళవారం నాటికి పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందిలో మొత్తం 49,998 మంది కొవిడ్‌ టీకాలు వేయించుకున్నారు. వైద్య సిబ్బందిని కూడా కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,43,483 మంది టీకా పొందారని ప్రజారోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు తెలిపారు.

 
ఇక తెలంగాణలో కొత్తగా 149 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. 86 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఏపీలో 70 కొత్త కేసులను గుర్తించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేయాలి : నిమ్మగడ్డ రమేష్