Publish Date: Sat, 06 Jul 2019 (15:11 IST)
Updated Date: Sat, 06 Jul 2019 (15:43 IST)
నాలుగు పులులు వాటి ట్రైనర్ను తీవ్రంగా గాయపరచడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఇటలీలోని ఓ సర్కస్ కంపెనీలో పులులకు శిక్షణ ఇచ్చే ఎటోర్ వెబర్(61) ఇటీవల ఆ పులులతో రిహార్సల్స్ చేయిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పులులు ఉన్న బోనులోకి వెళ్లిన వెబర్ వాటితో రిహార్సల్స్ చేయిస్తుండగా ఒక పులి ఆయనపై దూకి తీవ్రంగా గాయపరిచింది. మిగతా మూడు కూడా దానికి తోడయ్యాయి.
నాలుగు పులులూ కలిసి వెబర్ను పంజాలతో కొడుతూ బోనులో అటూఇటూ విసురుతూ ఆయన శరీరంతో ఆడుకున్నాయి. సర్కస్ కంపెనీలో పనిచేసే మిగతా సిబ్బంది, వైద్య సిబ్బంది వచ్చి రక్షించేటప్పటికే తీవ్రంగా గాయపడిన వెబర్ అనంతరం ప్రాణాలు కోల్పోయారు. ఓర్ఫీ సర్కస్లో పనిచేసే వెబర్కు ఇటలీలోని అత్యుత్తమ సర్కస్ శిక్షకుల్లో ఒకరిగా పేరుంది. యానిమల్ పార్క్ అనే షో కోసం ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆయన వాటికి శిక్షణ ఇస్తున్నారు.
కాగా, ఈ ఘటన తరువాత ఆ నాలుగు పులులను సర్కస్ కంపెనీ నుంచి జూకి తరలించారు. ఐరోపాలోని 20 దేశాలు సహా ప్రపంచంలోని సుమారు 40 దేశాల్లో సర్కస్లలో అడవి జంతులతో విన్యాసాలు చేయించడం, ప్రదర్శించడంపై నిషేధం ఉంది. కానీ, ఇటలీలో అలాంటి నిషేధం లేదు.