ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు గురువారం ఆతిథ్య ఆసీస్తో రెండో వన్డే మ్యాచ్ ఆడుతోంది. అడిలైడ్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ మరోమారు డకౌట్ అయ్యారు. భారత జట్టులో రోహిత్ శర్మ 73, శుభమన్ గిల్ 9, విరాట్ 0, శ్రేయాస్ అయ్యర్ 57 (బ్యాటింగ్), అక్సర్ పటేల్ 9 (బ్యాటింగ్) చొప్పున పరుగులు చేశారు. ఫలితంగా భారత్ 31.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేశారు. కాగా పెర్త్లో జరిగిన తొలి వన్డేలో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, పేసర్ జేవియర్ బ్యాటర్లను జట్టులోకి తీసుకుంది. అలాగే, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడి కోసం మాథ్యూ కుహ్నెమాను పక్కనపెట్టారు. అయితే, టాస్ సమయంలో కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ విషయాన్ని చెప్పడం మర్చిపోయాడు.
టాస్ గెలిచిన అనంతరం మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. "పెర్త్లో వర్షం ఇబ్బంది పెట్టినా మేం ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. రెండో మ్యాచ్లోనే సిరీస్ గెలిచే అవకాశం రావడం అద్భుతం. మా జట్టులో యువ ఆటగాళ్లున్నారు. ఇక్కడి ప్రేక్షకుల ముందు మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను" అని అన్నాడు.
భారత కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. "పిచ్ కొన్ని రోజులుగా కవర్ల కింద ఉండటంతో మేం కూడా టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. పిచ్ బాగుంది. ఆరంభంలో బౌలర్లకు కొద్దిగా సహకారం లభించవచ్చు. అయినా, మొదట బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వాతావరణం బాగుంటుందని ఆశిస్తున్నాను" అని తెలిపాడు.
తుది జట్లు:
భారత్ : రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ రెన్షా, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్టెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్ వుడ్.