గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడును పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
మనోహర్ నాయుడుతో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్లను కూడా క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
కాగా, కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది మార్చి రెండో వారంలో గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది.