Publish Date: Tue, 15 Mar 2022 (10:01 IST)
Updated Date: Tue, 15 Mar 2022 (10:04 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మూడో వర్థంతి వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే రోజున ఆయన పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. కానీ, ఈ హత్యకు పాల్పడిన నిందితులు ఎవరో స్పష్టంగా ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తుంది.
ఇదిలావుంటే, వైఎస్.వివేకా తృతీయ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులైన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వీరితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా పులివెందులకు వస్తున్నారు.