Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాక్షి మీడియా జగన్ చేతిలో ఉంది.. ఏదైనా నమ్మించగలడు.. వైఎస్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ

ys sharmila

ఠాగూర్

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:14 IST)
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదంపై తన గురించి, తన తల్లి గురించి చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ వివరాలను పరిశీలిస్తే, 
 
"ఈ రోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా వైఎస్ఆర్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. 
 
అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. "రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే", తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. "నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం". వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కి సమాన వాటా ఉండాలి. 
 
రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గారు "గార్డియన్" మాత్రమే. అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి గారి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి గారి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ, స్పష్టంగా తెలిసిన విషయం. (ఇంక్లూడింగ్ : కేవీపీ రామచందరరావు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు). నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా... భారతి సిమెంట్స్ అయినా... సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా... నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్. (ఒక్క సండూరు మినహాయించి). రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు.
 
స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈ రోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు.. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే.. ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే.
 
నేను జగన్ మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాట అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి గారు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే.. ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తుల పై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యిసార్లు వీళ్ళను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు.
 
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత.. 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని.. నా శక్తికి మించిన సహాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో, ఏమో.. నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినట్లుగానే.. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే. ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీల్లోనీ డివిడెండ్‌లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్ళు చేసింది ఉపకారం కాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్‌లో సగం వాటా ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుగా చూపించమన్నారు.
 
2019లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్నచూపు చూడటమే కాకుండా సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అని ఇజ్రాయేల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. ఇందుకు అమ్మా, నేను వద్దు అని చెప్పాం. లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టాడు. తర్వాత రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక, భారతి సిమెంట్స్, సాక్షిలో నాకు ఎక్కువ వాటా కావాలని అడిగాడు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు కూడా భావ్యం అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే.. 5 శాతం ఎక్కువ తీసుకో.. లేదా 10 శాతం ఎక్కువ తీసుకో.. కానీ 20 శాతం ఎక్కువ కావాలని అడగడమంటే అన్యాయం అనిపిస్తుంది అని అమ్మ చెప్పింది. అయినా ఇంతే అని బుల్డోజ్ చేశారు. తర్వాత అర్థగంటలో ఈ ఆస్తులు నీకు, ఈ ఆస్తులు నాకు అని తేలిపోయింది. దీని ప్రకారం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్‌లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్‌లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి రావడం జరిగింది.
 
ఆ కొద్దీ వారాల్లోనే ఎంవోయూ తయారైంది. అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్స్ షేర్స్, యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి... అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని, ఒప్పందం జరిగి సంతకాలు పెట్టాం. నా వాటా నాకు ఇస్తున్నాడు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదనేది వాస్తవమైనా, జగన్ మోహన్ రెడ్డి గారిది పైచేయిగా ఉన్నది కాబట్టి.. వాళ్ళు రాసినదానిపై అమ్మ నన్ను సంతకం పెట్టమని కోరింది. కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను, ఎంవోయూ మీద సంతకం పెట్టిన 2019 లోనే ఇవ్వాల్సి ఉండగా.. ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదు. అమ్మ గట్టి ఒత్తిడి మేరకు, క్లాసిక్, సండూరు హెూల్డ్ చేస్తున్న 52 శాతం సరస్వతి షేర్స్ నీ 2021 లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ళ ఇండివిడ్యువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.
 
అదే 2021లో, నేను రాజకీయాల్లో అడుగుపెట్టడం, మొదట తెలంగాణలో, ఆ తర్వాత కాలంలో ఆంధ్రకు రావడం జరిగింది. తనకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానని, నన్ను తొక్కడానికి జగన్ మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నం లేదు. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తే, నన్ను అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా, సోషల్ మీడియాలో ఉచ్చం, నీచం లేకుండా, పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న దాన్ని అనే ఇంగితం కూడా లేకుండా, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. నన్నే కాదు, వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు సాక్షి మీడియాలో అసభ్యకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక.. ఆ ఓటమికి నేను కారణం అని వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని, బంధువులను నా దగ్గరకు పంపించడం జరిగింది. మాకు విరోధం వద్దు అంటూనే.. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండీషన్ పెట్టారు. నేను జగన్ మోహన్ రెడ్డి గారి మీద, భారతి రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ప్లాట్ ఫాంలో మాట్లాడకూడదనేది ఆ కండిషన్ సారాంశం. ఆ కండిషన్ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించలేదు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్‌మెంట్ జరగలేదు.
 
సెటిల్‌మెంట్‌కి ఒప్పుకోలేదని మళ్ళీ కక్ష్య కట్టి, నా మీద, అమ్మ మీద ఎన్‌సీఎల్టీలో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. ప్రజల్లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి.. నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీల్లో ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు. 32 కోట్లు విలువ జేసే భూములు మాత్రమే. షేర్ల బదిలీకి, ఆయన బెయిల్ రద్దుకి ఎటువంటి సంబంధం లేదు.
 
నిజానికి ఎన్.సి.ఎల్.టిలో జగన్ మోహన్ రెడ్డి గారు వేసిన కేసు అమ్మ మీద కాబట్టి, ఈ విషయం బయటకు వస్తే, వైఎస్ఆర్ కుటుంబం అప్రతిష్టపాలైతే, యావత్ ప్రపంచం నాలుగు రకాలుగా మాట్లాడితే, అమ్మ ఎంతగానో క్షోభపడుతుందని, ఇది మాలో మేమే విషాన్ని గొంతులో దాచుకున్నట్టు దాచుకున్నాము. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి ఇది. విలువలు, కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర రెడ్డి గారి కుమారుడే సొంత తల్లిని కోర్టుకి ఈడ్చడం, ఆ తల్లికి ఎంత అవమానం.? అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం, నా పక్కనే నిలబడి మాటల్లేని వేదన నిండిన మా అమ్మను మరింత బాధపెట్టకూడదని, అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి మేము ఎక్కడా బయట పెట్టలేదు. బయట పడకుండా ఉండటానికి ప్రయత్నం చేశాం. 
 
కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక జగన్ మోహన్ రెడ్డి గారు కారణం అని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి, మమ్మల్ని మోసం చేసిన వాళ్ళుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా? నేను జగన్ గారికి ఒక లెటర్ రాస్తే.. అది టీడీపీ హ్యాండిల్‌లో పోస్ట్ అయితే... నాకు ఏం సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను గాని, నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు లేదు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగు చాటున ఉండి, ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
 
అమ్మ, నేను మోసం చేస్తున్నామని గాని, లేక ఆస్తి కోసం అత్యాశ పడుతున్నామని గాని, వైఎస్ఆర్ అభిమానులు భావించకూడదని.. పైనున్న వాస్తవాలు అన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుచేస్తున్నా.. ఎంవోయూ నా చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా... దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా... ఏ ఒక్క మీడియా కి కానీ, కోర్టుకి కానీ, ఈ ఎంవోయూ నాకు నేనుగా బయటపెట్టలేదు. అవకాశం, అవసరం ఉన్నా... ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా.. కుటుంబ గౌరవం, వైఎస్ఆర్ పరువు కోసం నేను ఎక్కడా 5 ఏళ్ళు ఎంవోయు బయట పెట్టలేదు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఎంవోయూ ఈరోజు బయటకు వచ్చిందన్నా.. పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా.. ఎన్.సి.ఎల్.టి.లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బ్రతుకు మీద అసహ్యం కలిగించి, వైఎస్ఆర్ అభిమానులను ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు.
 
కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో "వైఎస్ఆర్ బంధం" ఏర్పరుచుకున్న ప్రతి వైఎస్ఆర్ బంధువుకి ఈ వివరణ ఇస్తున్నాను. వైఎస్ఆర్ అభిమానులు,అమ్మను నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని, వాస్తవాలను తెలియ పరుస్తూ...
 
మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ
వైఎస్ షర్మిలా రెడ్డి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన కొత్త.. భర్తతో అలా షికారుకెళ్లింది.. అంతే సామూహిక అత్యాచారం