Publish Date: Tue, 18 Jun 2024 (09:49 IST)
Updated Date: Tue, 18 Jun 2024 (09:50 IST)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఈవీఎంలను నేరుగా టార్గెట్ చేసి అనుమానాలు వ్యక్తం చేయలేదు.
అయితే, తొలిసారిగా ఆయన ట్విట్టర్లో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈవీఎంలపై నమ్మకం క్షీణిస్తున్న నేపథ్యంలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించడం మంచి ఎంపిక అని ఆయన సూచించారు.
"న్యాయం జరిగేలా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలో, పేపర్ బ్యాలెట్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తారు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం కూడా అదే దిశలో వెళ్లాలి' అని జగన్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చలకు దారి తీసింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పేర్కొన్న టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కూడా బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి ఓటేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.