నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చిరువ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు.
రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని, సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.