Publish Date: Wed, 28 Apr 2021 (08:18 IST)
Updated Date: Wed, 28 Apr 2021 (08:55 IST)
యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని యువత ప్రజాసేవే లక్ష్యంగా ఎదగాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. పార్టీలో సమూల మార్పులకు నాంది పలికిన లోకేష్ అన్ని అనుబంధ విభాగాల్లో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
అందులో భాగంగా మంగళవారం తెలుగుయువత ప్రధాన కార్యదర్శుల నియామకం పూర్తి చేసారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శులను రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నియమించడం జరిగింది. తిరుపతికి చెందిన రాగుల ఆనంద్ గౌడ్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన యెల్లావుల అశోక్ యాదవ్, అమలాపురాని చెందిన చెరుకూరి సాయిరామ్, యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ధర్మారెడ్డి నాయుడు, విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్, హిందూపూరానికి చెందిన గడుపుటి నారాయణస్వామి, మాడుగుల నియోజకవర్గానికి చెందిన కర్రి సాయికృష్ణలను రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
కృష్ణా జిల్లాకు చెందిన యువకుడు,విద్యావంతుడు కిలారు నాగ శ్రవణ్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పదవి పొందారు. 27 ఏళ్ల కిలారు నాగ శ్రవణ్ ఇంజినీరింగ్ పూర్తి చేసారు. ఎటువంటి రాజకీయం కుటుంబ చరిత్ర లేని శ్రవణ్ స్వయంశక్తితో రాజకీయాల్లో ఎదిగారు. యునైటెడ్ నేషన్స్ యూత్ డివిజన్తో సహా పలు యూత్ ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేసిన అనుభవం శ్రవణ్ కి కలిసొచ్చింది. రాజకీయాల్లో యువత పాత్ర,సామాజిక కార్యక్రమాలు,యువతని సేవా మార్గం వైపు నడిపించేలా చేసిన అనేక కార్యక్రమాలు నాగ శ్రవణ్కి పదవి దక్కడంలో కీలకపాత్ర పోషించాయి.
2018లో కేంద్ర ప్రభుత్వం నుండి నేషనల్ యూత్ అవార్డ్ అందుకున్నారు శ్రవణ్. ఎటువంటి రాజకీయ అండదండలు లేని నాకు ఈ పదవి దక్కడం టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు యువతకు ఇస్తున్న ప్రాధాన్యత కు నిదర్శనం అని శ్రవణ్ అన్నారు. పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతను స్వీకరించి యువత పడుతున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని కిలారు నాగ శ్రవణ్ ప్రకటనలో పేర్కొన్నారు.