Publish Date: Thu, 03 Sep 2020 (22:21 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (22:23 IST)
సొంత పార్టీలో ఉన్న నేతలు మన మాట వింటారు. వేరే పార్టీ నుంచి వచ్చే వారైతే ఇక చెప్పాలా. ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ఉంటారు. ఇప్పుడిదే జగన్కు పెద్ద తలనొప్పిగా మారుతోందట. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలుచుకుని సిఎం అయిన జగన్మోహన్ రెడ్డికి వైసిపిలో రెండు వర్గాల మధ్య పోరు కాస్త పెద్ద తలనొప్పిని తెచ్చి పెడుతోంది.
తాజాగా వైఎస్ఆర్ వర్థంతి సంధర్భంగా ఈ వ్యవహారం బయటపడింది. ఒకటి ప్రకాశం జిల్లా చీరాలలో.. మరొకటి విజయవాడ కేంద్రంగా బహిర్గతమైంది. ఎవరు అరాచకాలు పాల్పడినా, బెదిరింపులకు గురిచేసినా భయపడేది లేదని, వారి ఆటలు సాగనివ్వమని కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ అన్నారు.
ఇది మొత్తం ఆమంచి క్రిష్ణమోహన్ను ఉద్దేశించిందనేది వాదన. దీనికి క్రిష్ణమోహన్ దీటైన సమాధానం ఇచ్చారు. జగన్ కాళ్ళు పట్టుకుని పార్టీలోకి వచ్చిన వారి గురించి నేను మాట్లాడాలా అని అన్నారు. ఇది కాస్త వైసిపి కార్యకర్తలను ఆలోచింపజేసింది.
ఇలాగే విజయవాడతో పాటు మరికొన్ని జిల్లాల్లోను జరిగింది. ఇది కాస్త సిఎం దృష్టికి వెళ్ళింది. టిడిపి నుంచి వైసిపిలోకి వచ్చిన నేతలతోనే అసలు సమస్య వచ్చి పడుతోందని జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ నేతలను ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దాలని పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలని ఆదేశాలిచ్చారట. ప్రస్తుతం సీనియర్ నేతలు ఆ పనిలో ఉన్నారట.