Publish Date: Sat, 15 Jun 2024 (10:04 IST)
Updated Date: Sat, 15 Jun 2024 (10:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యత కల్పించడాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతించారు. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50 శాతం కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు.
సీఎం చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం సాయంత్రం కలిసిన అనంతరం రెండో బ్లాక్ దగ్గర విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మార్పు.. దానికి అనుగుణంగా క్యాబినెట్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత క్యాబినెట్ అందుకు అనుగుణంగా ఉంది. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నాకు 29 ఏళ్లకే అవకాశం ఇచ్చారు. చిత్తశుద్ధితో పనిచేశాం కాబట్టే ఈ స్థాయికి రాగలిగాం.
సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి, యువతకు అవకాశాలు ఇవ్వాలి. పాత, కొత్త కలయిక ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. ప్రజలు కోరుకున్న విధంగా మార్పులు తెస్తామని హామీలు ఇచ్చాం. 30 ఏళ్లు అధికారంలో ఉంటానన్న సీఎం జగన్ కళ్లు ఐదేళ్లలోనే ప్రజలు మూసేశారు. ప్రజలు కోరుకున్నట్లు ఆయన ఏమీ చేయలేకపోయారు. ఐదేళ్ల పాలనతో ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆయన సంక్షోభంలోకి నెట్టేశారు. చంద్రబాబు సమర్థతతో రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని యనమల విశ్వాసం వ్యక్తం చేశారు.
వరుణ్
Publish Date: Sat, 15 Jun 2024 (10:04 IST)
Updated Date: Sat, 15 Jun 2024 (10:05 IST)