Publish Date: Thu, 24 Sep 2020 (14:57 IST)
Updated Date: Thu, 24 Sep 2020 (14:58 IST)
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు చేసి ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్కు ఆనవాయితిగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే తన కేసుల భవిష్యత్తే జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమని తెలిపారు.
గత 16 నెలల్లో కేంద్రం నుంచి జగన్ ఏం సాధించుకొచ్చారో చెప్పాలని అన్నారు. 16 నెలల్లో రూ.1.26 లక్షల కోట్లు అప్పులు తేవడమే జగన్ రికార్డ్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు 31వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో గిన్నిస్ రికార్డ్ నమోదు చేశారని, కానీ జగన్ అప్పులు తేవడంతో వరల్డ్ రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై గొగ్గోలు పెట్టిన వైసీపీ నోరు ఇప్పుడెందుకు మూతపడిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పేరెత్తడం మరిచిపోయి 16 నెలలు గడిచిపోయిందని విమర్శించారు. అయినా జగన్ ఢిల్లీ వెళ్లింది సంజాయిషీలు ఇవ్వడానికే తప్ప రాష్ట్రానికి రావలసినవి రాబట్టుకోవడానికి కాదని అన్నారు.