Publish Date: Mon, 27 May 2019 (11:11 IST)
Updated Date: Mon, 27 May 2019 (11:12 IST)
టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన మాస్ లీడర్ షిప్.. వారికంచూ వున్న ఓటు బ్యాంక్ వాళ్లని గెలిపించాయని చెప్పారు. టీడీపీ ఓటమికి గల కారణాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన యామిని.. వైఎస్సార్ సెంటిమెంట్, ఓటు బ్యాంక్తో జగన్ గెలిచారని.. అందుకే ఎన్నికల ప్రచారం తామెన్ని చెప్పినా వర్కౌట్ కాలేదన్నారు.
జగన్పై ఎన్ని కేసులు పడినా ప్రజలు ఆయనలో ఓ నాయకుడిని చూసి ఉంటారు. ప్రజలు ఆయనలో ఓ పాజిటివ్ నెస్ను తీసుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చునని యామిని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరడం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని పోవడం వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు తాను వ్యతిరేకంగా మాట్లాడబోనని స్పష్టం చేశారు.
ఇంకా ప్రజలకు ఏమి కావాలో, నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలనే దానిపై మాజీ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని.. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా తేడా లేదని ఆమె చెప్పారు. కానీ టీడీపీ తెచ్చిన పథకాలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.