చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. క్షణికావేశంలో భర్తపై ఉన్న కోపంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భార్యను కాపాడబోయిన భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భార్యాభర్తలిద్దరు చావుబతుకుల మధ్య ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చిన్నగొట్టికల్లు దిగువ వీధిలో శ్రీనివాసులు, రేణుకలు నివాసముంటున్నారు. పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న విషయానికి కూడా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో మనస్థాపానికి గురైన రేణుక ఇంటిలో తలుపులు మూసుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
దీన్ని గమనించిన భర్త శ్రీనివాసులు తలుపులు పగులగొట్టి రేణుకను కాపాడే ప్రయత్నం చేయగా అతను కూడా మంటల్లో చిక్కుకున్నాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. రేణుక, శ్రీనివాసుల పరిస్థితి ఆందోళనా కరంగా వైద్యులు నిర్థారించారు.