Publish Date: Thu, 02 Jul 2020 (18:15 IST)
Updated Date: Thu, 02 Jul 2020 (18:21 IST)
భర్తతో విభేదాలు వచ్చాయి. తనను, కొడుకును హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితురాలు వచ్చింది. వివరాల్లోకి వెళితే... 2013 సంవత్సరంలో నరసారావుపేటలో ఎస్ఐగా పనిచేసిన జగదీష్ దగ్గరకు తను వెళ్లాననీ, అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కోరినట్లు ఓ మహిళ ఆరోపిస్తోంది.
న్యాయం చేస్తానని చెప్పి తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో 2017 సంవత్సరంలో తనను రహస్యంగా వివాహం చేసుకుని, తనను గర్భవతిని కూడా చేశాడని అంటోంది. అతడి కారణంగా తనకు బాబు పుట్టాడనీ, ప్రస్తుతం ఆయన ముప్పాళ్ళ ఎస్.ఐ.గా పనిచేస్తున్నాడని తెలిపింది.
అయితే ప్రస్తుతం తమ కుటుంబాన్ని ఎస్.ఐ. పట్టించుకోవడం లేదని, పోషణ భారమైందని అడిగితే తమపై దాడి చేస్తున్నాడని, కొడుకును కూడా కొడుతున్నాడని వాపోయింది మహిళ. తనకు న్యాయం చేయాలంటూ నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్కు వచ్చి ఎస్.ఐ. పైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పలు టీవీ ఛానళ్లకు కూడా తన గోడును వెళ్లబోసుకుంది.