Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి

రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు ఇస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి
, శుక్రవారం, 31 జనవరి 2020 (20:57 IST)
వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా పెన్షన్లు ఇస్తుంటే చంద్రబాబు భరించలేకపోతున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‌

గతంలో పచ్చచొక్కా వేసుకుంటేగాని చంద్రబాబు పెన్షన్లు ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. చివరికి చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో టిడిపి నాయకులు సిఫార్సు చేశారని భర్త వున్న వారికి కూడా వితంతు పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు.

దానిని వ్యతిరేకిస్తూ ఆనాడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఆందోళనలు చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టిడిపి నాయకులు చెప్పినవారికి కనీస అర్హతలు కూడా చూడకుండా పెన్షన్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు.

ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కులం, మతం, ప్రాంతం చూడకుండా... రాజకీయాలతో సంబంధం లేకుండా... అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ లు ఇస్తున్నారని అన్నారు. పెన్షన్లను తీసి వేస్తున్నారంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన వాటి కన్నా ఎక్కువ పెన్షన్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇస్తోందని స్పష్టం చేశారు. 
 
గతంలో ఉన్న అర్హతలను కూడా సడలించి మరింత మందికి మేలు చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే లంచం ఇవ్వాల్సి వచ్చేదని, పెన్షన్‌ మంజూరు అయిన తర్వాత కూడా నెలానెలా జన్మభూమి కమిటీలకు కప్పం కట్టాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

ఇన్నిచేసినా.. కేవలం తెలుగుదేశం వారికి తప్ప మరెవ్వరికీ పెన్షన్లు దక్కేవి కావని, అదికూడా అరకొరగానే ఇచ్చారని అన్నారు. వృద్ధులతో రాజకీయాలు చేసిన చంద్రబాబు దుర్మార్గపు పాలన భరించలేక పలువురు వృద్ధులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేసి మరీ పెన్షన్లకోసం ఆదేశాలు తెచ్చుకున్నారని తెలిపారు.

ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేసిన చంద్రబాబు ఇవాళ... వృద్దులకు మేలు జరుగుతున్నా.. సహించలేక గగ్గోలు పెడుతున్నాడని విమర్శించారు. ‌ చంద్రబాబులా పెన్షన్ల మంజూరులో ఎలాంటి అవకతవకలుగాని, తప్పులుగాని లేకుండా అత్యంత పారదర్శకంగా, అవినీతి రహితంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని అన్నారు.

ఎంపికైన వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచామని, ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేయాలి, ఎవరికి చేయాలి అన్న దానిపై వివరాలను గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు నేరుగా వారి వివరాలను తీసుకుని సహాయ పడుతున్నారని, రేపటి నుంచి ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు అందచేస్తారని అన్నారు.

ఇలాంటి శుభవేళ చంద్రబాబు అబద్ధాలు చెప్పి తన సహజ శైలిని చాటుకుంటున్నాడని అన్నారు. వృద్ధులకు, వితంతువులకు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ ప్రభుత్వం హయాంలో మంచి జరుగుతుంటే తట్టుకోలేక చంద్రబాబు గుండెలు బాదుకుంటున్నాడని విమర్శించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 54.65 లక్షల మందికి ఒకే రోజు పింఛన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు గానూ ఇప్పటికే రూ.1320.14 కోట్లు విడుదల చేశామని, రేపటి నుంచి పెన్షన్ల చెల్లింపులు ప్రారంభమవుతున్నయని అన్నారు. 
 
పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.15,675.20 కోట్లు కేటాయించగా, శనివారం నాటి చెల్లింపుల కోసం రూ.1320.14 కోట్లు విడుదల చేసిందని వెల్లడించారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా పెన్షన్ రాకపోతే వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.

వాలెంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు దరఖాస్తుదారుల అర్హతలను స్వయంగా పరిశీలించి పెన్షన్ మంజూరు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో అర్హత వున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించాలన్న మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తున్నారని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింఛన్ల చెల్లింపులో సువర్ణ అధ్యాయం.. ఇంటి వద్దనే నేరుగా చెల్లింపు