Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిసిగ్గుగా వెల్లంపల్లి అబద్ధాలు: దీపక్ రెడ్డి ఆగ్రహం

నిసిగ్గుగా వెల్లంపల్లి అబద్ధాలు: దీపక్ రెడ్డి ఆగ్రహం
, గురువారం, 18 జూన్ 2020 (16:58 IST)
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే మండలిలో వీడియో ఫుటేజీలను బహిర్గతం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సవాల్ విసిరారు.

ఈ మేరకు ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ..."శాసనమండలిలో ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టాం. వారు చెప్పేదొకటి, చేసేదొకటి. దీంతో సహనం కోల్పోయి 18 మంది మంత్రులు శాసనమండలికి వచ్చి మమ్ముల్ని ధూషించారు. గలాటా పెట్టుకోవాలని చూశారు. నోటికి వచ్చినట్లు ఘోరమైన తిట్లు, మాటలు అన్నారు.

బిల్లులు పాస్ కావాలనే ఉద్దేశంతో మేం ఉంటే.. ఏదో విధంగా గొడవ పెట్టుకుని బిల్లులు పాస్ కాకుండా చేసి, టీడీపీపై నెపం వేయాలని కుట్ర పన్నారు. ఆర్థికమంత్రి రాగానే అప్రాప్రియేషన్ బిల్లు పాస్ చేయాలని కోరాం. అయితే వారు ముందు సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ముందు అప్రాప్రియేషన్ బిల్లు పెట్టాలని, లేకపోతే సమస్యలు వస్తాయని 20 నుంచి 30 సార్లు మేం విజ్ఞప్తి చేశాం.

బడ్జెట్ సెషన్ పేరుతో రాజధాని బిల్లు పాస్ చేసుకోవాలనేదే వారి ఉద్దేశం. సీఆర్డీయే రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపామని ప్రభుత్వమే హైకోర్టులో ఒప్పుకుంది. సెలెక్ట్ కమిటీ పేర్లు సెక్రటరీ సిఫార్సు చేయలేదు. బిల్లులు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు తీసుకురాకూడదు. బిల్లులు టీడీపీ ఆపిందని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.

ఒక ప్లాన్ ప్రకారమే 18 మంది మంత్రులు మండలికి వచ్చారు. గతంలో కూడా ఇదేవిధంగా గలాటా చేశారు. కెమెరాలు, లైవ్ టెలికాస్టింగ్ ఆపేశారు. 3, 4 సార్లు మాపై దాడులు చేసేందుకు మావైపు దూసుకు వచ్చారు. బయటకు వచ్చి మాత్రం టీడీపీ సభ్యులు దాడి చేసినట్లుగా నిసిగ్గుగా చెబుతున్నారు. వైసీపీ సభ్యులు మా వైపు వస్తే.. దాడి మేం చేసినట్లా, వారు చేసినట్లా?

ఒక మంత్రి ప్యాంట్ జిప్ ఓపెన్ చేశారు. మహిళా సభ్యులున్నా పట్టించుకోలేదు. గత సెషన్ లో కూడా గ్యాలరీలోకి వైసీపీ ఎమ్మెల్యే వచ్చి జిప్ ఓపెన్ చేశారు. ఏ స్థాయికి వ్యవస్థను వైసీపీ నేతలు దిగజార్చారో ప్రజలు గమనించాలి. ప్రజా సమస్యలు చర్చించకుండా వైసీపీ సభ్యులు దాడులు, ధూషణలకు దిగుతున్నారు. శాసనాలు రాసే వారే వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇది కరెక్టేనా?

72 ఏళ్ల చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఎక్కడా రాలేదు. ప్రభుత్వమే క్రిమినల్స్ గా మారి వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. సెలెక్ట్ కమిటీ విషయంలో సెక్రటరీని బెదిరించి ఛైర్మన్ మాటలు వినవద్దని చెప్పారు. రమేష్ కుమార్ వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. కోర్టులను పట్టించుకోవడం లేదు. ప్రశ్నించిన కౌన్సిల్ ను రద్దు చేస్తామంటున్నారు. అధికారులను భయబ్రాంతులకు గురిచేసి వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకుంటున్నారు.

ఇదేమన్నా రాజుల, పాలెగాళ్ల రాజ్యమా? ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే మండలిలో నిన్నటి వీడియో ఫుటేజీలను వైసీపీ నేతలు బహిర్గతం చేయాలని సవాల్ చేస్తున్నా. ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రజలకే అర్థమవుతుంది. వైసీపీ నేతలు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. వీడియోలు బయటపెట్టాలి. వైసీపీ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది. పరిపాలించే హక్కు కూడా కోల్పోయారు. ప్రజల కోసమే మేం పనిచేస్తున్నాం.

వైసీపీ సభ్యులు మమ్ముల్ని నోటికొచ్చినట్లు తిడుతున్నారు. దాడులు చేస్తున్నారు. మేం ఏం చేయాలో ఏపీ ప్రజలు చర్చించుకుని మాకు మెసేజీలు పెట్టాలి. ఇదేవిధంగా మేం కొట్టించుకుంటూ ఉండాలి. లేదా మేం కూడా తిట్టాలా, కొట్టాలా అని ప్రజలు ఆలోచించి చెప్పాలి. వైసీపీ నేతల మాదిరిగా మేం రౌడీయిజం చేయడానికి కాదు ఉంది.

చంద్రబాబు చెప్పేది మేం ప్రజల పక్షాన నిలబడాలి అని. వైసీపీ నేతలను ఏం అనాలో కూడా తెలియడం లేదు. మూడు గంటలు అప్రాప్రియేషన్ బిల్లు పాస్ చేయాలని మేం కోరితే.. టీడీపీ అడ్డుకుందని వైసీపీ పచ్చి అబద్ధాలు ఆడుతోంది. నేను ఒక్కడినే పోడియం వద్దకు వెళ్లి సంబంధం లేనివారిని బయటకు పంపాలని కోరా. వెల్లంపల్లి శ్రీనివాస్ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.

నన్ను తిట్టి బీద రవిచంద్ర యాదవ్ ను కాలితో తన్నాడు. తన మీద పడితే బీద రవిచంద్ర ఆయనను తోసేశాడు. బీద రవిచంద్రే తనపై దాడి చేశాడని వెల్లంపల్లి అబద్ధాలు చెబుతున్నారు. మూలన ఉన్న లోకేష్ గారు జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ కు మెసేజ్ పెడుతుంటే.. మంత్రులు వచ్చి ఫోటోలు తీస్తున్నారంటూ లోకేష్ పై దాడికి ప్రయత్నించారు.

సాక్షిలో లోకేష్ పాత ఫోటోలు చూపిస్తూ... నిన్న ఫోటోలు తీసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్కటి కూడా నిజం మాట్లాడటం లేదు. అమెరికాలో నల్ల జాతీయుడిని పోలీసు కాల్చి చంపితే.. దేశం మొత్తం నిరసించింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంను కాలరాస్తున్న వైసీపీ విధానాలను ప్రజలు నిరసించాలి. 

వైసీపీ ఏడాది పాలనలో అధికారమదంతో చేసిన కేసులు 800, 13 హత్యలు, మహిళలపై అరాచకాలు 368, స్పందనలో మహిళల ఫిర్యాదులు 4987, ప్రశ్నించిన వారిపై 74 కేసులు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు 350, టీడీపీ నాయకులను అక్రమంగా జైలుకు పంపించింది 51 మంది, అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా కక్షసాధింపులు 360,  బీసీలపై 225 కేసులు, దళితులపై 78 కేసులు, గిరిజనులపై 11 కేసులు, మైనార్టీలపై 42కేసులు, ఓసీలపై 228 కేసులు పెట్టారు.

ఇవన్నీ డీజీపీకి పంపించడం జరిగింది. వ్యవస్థలపై నమ్మకం ఉంటే వీటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకేష్ వ్యవహరించిన తీరుతో సిగ్గేస్తోంది: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌